రామాయణంలో ఊహించని ఆకర్షణలు

అసలు ఎలాంటి అధికారిక లాంచ్ కాకపోయినా బాలీవుడ్ అతి పెద్ద బడ్జెట్ మూవీ రామాయణం షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఏ దశలో ఉందనే వివరాలు బయటికి రానివ్వడం లేదు కానీ ఆ మధ్య వచ్చిన కొన్ని ఫోటో లీక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. టీమ్ జాగ్రత్త పడి వాటిని తీయించేసినా అప్పటికే చాలా దూరం వెళ్లిపోయాయి. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ ఇతిహాస గాధని వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారనే టాక్ ఇప్పటికే చక్కర్లు కొడుతుంది. ఇది పెద్ద విశేషం కాదు కానీ ఈ రామాయణంలో మనం ఊహించని ఎన్నో ఆకర్షణలు ఉన్నాయట.

అందరూ అనుకున్నట్టు ఇందులో రన్బీర్ కపూర్ కేవలం రాముడి వేషం వేయడం లేదు. పరశురాముడిగా కూడా కనిపించబోతున్నాడు. రెండు గెటప్స్ మధ్య గుర్తుపట్టలేనంత వ్యత్యాసం చూపించబోతున్నారు. రెండు శ్రీవిష్ణు అంశ ఉన్న అవతరాలే కాబట్టి దానికి అనుగుణంగా రన్బీర్ తో ద్విపాత్రాభినయం వేయిస్తున్నారు. రావణుడు సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు అడ్డొచ్చినందుకు గాయపడే జటాయు పక్షికి అమితాబ్ బచ్చన్ డబ్బింగ్ చెప్పబోతున్నారు. మొదటి భాగంలో రామసీతల వివాహం, పద్నాలుగేళ్ల వనవాసం చూపించి రావణుడి ఎంట్రీతో శుభం కార్డు వేస్తారు. పార్ట్ 2 నుంచి యష్ విశ్వరూపం ఉంటుంది.

హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా లక్ష్మణుడి కోసం తొలుత నవీన్ పోలిశెట్టిని అనుకున్నారు కానీ సాధ్యపడకపోవడంతో ఆ స్థానంలో రవి దూబేని తీసుకున్నారు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూపించినంత గొప్పగా రామాయణాన్ని తీసి చూపిస్తానని చెబుతున్న నితేశ్ తివారి మొదటి భాగాన్ని 2026లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మూడు భాగాలు ఉంటుంది. యానిమల్ ద్వారా మార్కెట్ పరంగా డబుల్ ప్రమోషన్ కొట్టేసిన రన్బీర్ మధ్యలో వచ్చే గ్యాప్ లో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇది కూడా త్రీ సీక్వెల్ సిరీస్.