కత్తిరింపులు లేకుండా ‘ఖడ్గం’ చూపిస్తారా

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన సినిమాల్లో ఖడ్గంది ప్రత్యేక స్థానం. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంత ఓపెన్ గా చూపించిన చిత్రం తెలుగులో మరొకటి రాలేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇది విశేషం కాదు కానీ 2002లో విడుదలైన ఒరిజినల్ వెర్షనే చూపిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. మనోభావాలు సున్నితమైపోయాయి. సెన్సార్ ధోరణిలో కూడా ఛేంజ్ వచ్చింది. కత్తిరింపులు, మ్యూట్లు ఎక్కువయ్యాయి. ఖడ్గంలో వీటికి అవకాశం ఎక్కువ.

రీ రిలీజ్ కాబట్టి మళ్ళీ రెన్యూవల్ సెన్సార్ చేయించి ఉంటారు. ఇది శాటిలైట్ స్ట్రీమింగ్ కి ఇచ్చినప్పుడే పూర్తయి ఉంటుంది. జెమిని ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్నప్పుడు గమనిస్తే బోలెడు మ్యూట్లు ఉంటాయి. ఇవన్నీ సెన్సార్ అబ్జెక్షన్లే. ఇప్పుడు చూడబోయే థియేటర్ వెర్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఖడ్గంలో కొన్ని సీన్లున్నాయి. క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిస్తే హైదరాబాద్ వీధుల్లో ఆ దేశపు జెండాని ఎగరేసి ఇండియన్ ఫ్లాగ్ కాల్చేబోయే ఎపిసోడ్ ఉంటుంది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముగ్గురు కలిసి వాళ్ళను చితకబాదటం ప్రధాన హైలైట్.

శత్రుదేశం పాకిస్థాన్ ని ఉద్దేశించి బోలెడు డైలాగులున్నాయి. సంభాషణల రచయిత ఉత్తేజ్ ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చెలరేగిపోవడం చూడొచ్చు. అప్పట్లో కొన్ని వివాదాలు వచ్చాయి కానీ సోషల్ మీడియా యాక్టివ్ గా లేని కాలం కావడంతో మరీ విపరీతంగా పోలేదు. కానీ రీ రిలీజులను ఒక పండగలా సెలెబ్రేట్ చేసుకుంటున్న అభిమానులు ఖడ్గంని సైతం అదే తరహాలో చూసేందుకు సిద్ధమవుతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా దేశభక్తి ఎలిమెంట్, అద్భుతమైన క్యాస్టింగ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, గ్రిప్పింగ్ నెరేషన్ వీటికోసమైనా ఖడ్గంని ఇప్పటి కుర్రకారుకి రికమండ్ చేయొచ్చు.