అర్హతలు ఉన్నా అందని అందలం

నిన్న ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఒక్క కార్తికేయ 2కు మాత్రమే అవార్డు దక్కడం పట్ల ఇండస్ట్రీ వర్గాలతో పాటు మూవీ లవర్స్ నిరాశని వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా సాధించిన ఎన్నో సినిమాలు కమిటీ దృష్టికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. సీతారామం రీమేక్ కాదు. మంచి నేపధ్యాన్ని తీసుకుని దర్శకుడు హను రాఘవపూడి గొప్పగా చిత్రీకరించాడు. హృద్యమైన సంగీతం హృదయాలను తాకుతుంది. అడివి శేష్ మేజర్ స్ట్రెయిట్ సబ్జెక్టే. ముంబై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో ఒక పోరాట యోధుడి కథని శశికిరణ్ తిక్క గొప్పగా ఆవిష్కరించారు.

వీటితో పాటు అంటే సుందరానికి, విరాట పర్వం, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలకు ఎన్నో అర్హతలున్నాయి. అయినా సరే పరిగణనలోకి రాలేదు. మాములుగా జాతీయ అవార్డు రావాలంటే నిర్మాత వైపు నుంచి నామినేషన్ వెళ్ళాలి. మరి అందరూ అది చేశారా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. తమిళంలో తప్ప ఇతర భాషల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయినా పొన్నియిన్ సెల్వన్ 1కి అన్నేసి పురస్కారాలు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం మల్టీ స్టారర్, భారీతనం అనే అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

కెరీర్ లో ఒక గొప్ప ఘనతగా భావించే జాతీయ అవార్డుని సాధించుకోవడం ఫిలిం మేకర్స్ గర్వంగా భావిస్తారు. ఇందులోనూ పోటీ ఉంటుంది కానీ సగటు ఆడియన్స్ పోల్చుకుని చూసినప్పుడు భాషతో సంబంధం లేకుండా నిర్ణయం సరైనదే అనిపించాలి. అప్పుడే ఇలాంటి ఇష్యూస్ రావు. కానీ ఈసారి కాస్త స్వరాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కన్నడలో సంచలన విజయం అందుకున్న ఛార్లీ 777 సైతం దేనికీ నోచుకోకపోవడం గమనించాల్సిన విషయం. సాయిపల్లవి గార్గి సైతం లిస్టులో ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికదు కానీ పారదర్శకత మరింత పెరగాలనేదే సగటు సినీ ప్రియుల కోరిక.