పట్టుబట్టి సాధించేసిన కమిటీ కుర్రోళ్ళు

విడుదల ముందు వరకు ఎలాంటి అంచనాలు లేవు. నిర్మాత నీహారిక కొణిదెలే అయినా ఆగస్ట్ 15 భారీ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో కేవలం వారం గ్యాప్ తో రిలీజయ్యే చిన్న సినిమా ఎలా నిలబడుతుందనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ కమిటీ కుర్రోళ్ళు వాటిని పటాపంచాలు చేసింది. యూనిట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం నాలుగు రోజులకే 7 కోట్ల 48 లక్షల గ్రాస్ సాధించి అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఇంత చిన్న చిత్రం అతి తక్కువ గ్యాప్ లో లాభాల్లోకి ప్రవేశించడం నిర్మాతనే కాదు ట్రేడ్ ని సైతం సంతోషంలో ముంచెత్తే సంగతి.

మహేష్ బాబు నిన్న ప్రత్యేకంగా కమిటీ కుర్రోళ్ళను పొగుడుతూ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. సూపర్ స్టారే చెప్పాడంటే కంటెంట్ బాగుంటుందనే నమ్మకంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లిన వైనం బుక్ మై షో ట్రెండ్స్ లో కనిపించింది. ఒకవేళ మురారి రీ రిలీజ్ కనుక లేకపోయి ఉంటే ఖచ్చితంగా పది కోట్ల మార్కు ఈపాటికే అందుకునేదన్న బయ్యర్ల మాటని తీసిపారేయలేం. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తీసిన కమిటీ కుర్రోళ్ళకు నైజామ్ లో బలమైన రన్ రావడం విశేషం. పంపిణి చేసిన మైత్రి డిస్ట్రిబ్యూటర్లకు మరో హిట్టు పడింది. నీహారిక బృందం ప్రమోషన్లు కొనసాగిస్తున్నారు.

సెకండ్ హాఫ్ మీద కొన్ని కామెంట్లు ఉన్నప్పటికీ కమిటీ కుర్రోళ్ళు ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెసయ్యింది. కాకపోతే రెండో వారంలో థియేటర్లు ఏ మేరకు కొనసాగుతాయో చూడాలి. తెలుగు, హిందీ కలిపి మొత్తం ఏడు కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. ఇటు చూస్తేనేమో సింగల్ స్క్రీన్ల కంటే మల్టీప్లెక్సుల్లో కమిటీ కుర్రోళ్ళు బాగా రాబడుతోంది. బయ్యర్లు సహకరిస్తే కాస్త చెప్పుకోదగినన్ని ఉండొచ్చు కానీ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఆయ్ ల మధ్య సెకండ్ వీక్ నెగ్గుకురావడం సవాలే. ఏదైతేనేం మొత్తానికి కుర్రోళ్ళు సౌండ్ లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద శబ్దమే చేశారు.