కర్ణన్ వదిలేశారు….గరుడన్ ఫిక్సవుతారా

మూడేళ్ళ క్రితం ధనుష్ కర్ణన్ తమిళంలో పెద్ద బ్లాక్ బస్టర్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొంది విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను సాధించింది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ కార్యరూపం దాల్చలేదు. రెండు పల్లెటూళ్ళ మధ్య కుల వివక్ష పాయింట్ ఆధారంగా చేసుకుని ఒక బస్ స్టాప్ చుట్టూ నడిపించిన ఈ విలేజ్ డ్రామా మన దగ్గర డబ్బింగ్ కాకపోయినా మూవీ లవర్స్ సబ్ టైటిల్స్ సహాయంతో ఓటిటిలో చూసేశారు. కథలో నేటివిటీ సమస్య కూడా ఉండటంతో కర్ణన్ తీయకపోవడమే మంచిదయ్యింది.

కట్ చేస్తే ఇటీవలే గరుడన్ అనే మరో మూవీ వచ్చింది. కమెడియన్ సూరి టైటిల్ రోల్ పోషించగా శశికుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. కోట్ల రూపాయల విలువైన గుడి భూములకు, ముగ్గురు స్నేహితులకు ముడిపెట్టి దురై సెంథిల్ కుమార్ తీర్చిదిద్దిన విధానం సూపర్ హిట్ అందించింది. విశేషం ఏంటంటే దీనికి కథను అందించి, నిర్మించింది కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈయన బ్రాండ్ ఈ సినిమా మార్కెటింగ్ లో బాగా ఉపయోగపడింది. ఇప్పుడీ గరుడన్ ని తెలుగులో సాయి శ్రీనివాస్ – నారా రోహిత్ – మంచు మనోజ్ కాంబోలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఇది అధికారికంగా చెప్పలేదు కాబట్టి ధృవీకరించలేం కానీ మొత్తానికి సెటప్ గట్రా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. గరుడన్ కు కీలకమైన మార్పులు చేస్తే తగిన డెప్త్ ఉన్న కథే. రివెంజ్ డ్రామాతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే గ్లామర్ టచ్, రెగ్యులర్ ఫైట్స్ లాంటి వాటికి అవకాశం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటివి చేయడం అవసరమే. రొటీన్ మూస లో కొట్టుకుపోతూ థియేటర్లకు జనాలను రానివ్వకుండా చేస్తున్న పాత చింతకాయ కంటెంట్ కంటే గరుడన్ లాంటి ప్రయోగాలు మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వేచి చూడాలి.