మైత్రి దూకుడు మాములుగా లేదు

శ్రీమంతుడు లాంటి పెద్ద సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తర్వాత టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన వైనం చూస్తూనే ఉన్నాం. మధ్యలో అందరిలాగే ఫ్లాపులు డిజాస్టర్లు చూస్తున్నప్పటికీ క్రమం తప్పకుండా బ్లాక్ బస్టర్లు పడుతూనే ఉన్నాయి. పుష్ప 2, ఫౌజీ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ నిర్మాణంతో పాటు ఇంకోవైపు డిస్ట్రిబ్యూషన్ ని పటిష్ట పరుచుకునే క్రమంలో మైత్రి ఏ అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. ముఖ్యంగా నైజాంలో బలమైన పట్టున్న దిల్ రాజు, ఏషియన్, సురేష్ సంస్థలకు ధీటుగా పంపిణి వ్యవస్థతో పాటు థియేటర్ రంగంలోనూ విస్తరణను చేపట్టింది.

ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ మూడింటి తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా తన ఉద్దేశమేంటో మైత్రి స్పష్టంగా చెబుతున్నట్టు అయ్యింది. ఎంత మొత్తమనే వివరాలు పూర్తిగా బయటికి రాకపోయినా చాలా క్రేజీ ఆఫర్స్ తో క్లోజ్ చేశారని సమాచారం. గత ఏడాది సంక్రాంతికి తమ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు థియేటర్ల విషయంలో ఇబ్బంది పడ్డ మైత్రి మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా పక్కా ప్రణాళికతో మూతబడిన సింగల్ స్క్రీన్లను లీజుకు తీసుకుని రినోవేట్ చేయించి నడుపుతున్నారు.

రాబోయే రోజుల్లో వీటిని మరింతగా విస్తరించే పనిలో ఉన్నారు మైత్రి మేకర్స్. ఎగ్జిబిషన్ రంగం కుదుపులకు లోనవుతున్నప్పటికీ ఇంత రిస్క్ చేసి పెట్టుబడులు పెట్టడమంటే మాములు విషయం కాదు. అందులోనూ వందల కోట్లు ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఇలా విడిగా డిస్ట్రిబ్యూషన్ కు డబ్బులు ఖర్చు చేయడం రిస్క్ తో కూడుకున్న పని. గత రెండేళ్లలో విడుదలకు కష్టపడ్డ ఎన్నో చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు పంపిణి పరంగా మైత్రి అండదండలు అందించింది. హనుమాన్ సైతం నైజాంలో బాలారిష్టాలు పడితే గట్టెక్కించారు. రికార్డు వసూళ్లు రాబట్టుకున్నారు. ఆగస్ట్ 15 వీళ్లకు బిగ్ డే కానుంది.