విశాల్ మీద కొత్త వివాదం ఏంటంటే

పందెం కోడి, అభిమన్యుడు లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న విశాల్ కు గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రత్నం తీవ్రంగా నిరాశ పరిచింది. కోలీవుడ్ లో ఓ మోస్తరుగా ఆడినా మన దగ్గర డిజాస్టర్ ముద్ర వేయించుకుంది. మార్క్ ఆంటోనీ ఒరిజినల్ మాత్రమే హిట్టయ్యింది. తరచుగా వివాదాల్లో ఉండే విశాల్ మెడకు కొత్త కాంట్రావర్సి చుట్టుకుంది. గతంలో తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 12 కోట్ల మేరకు స్కామ్ చేశాడని, అందుకని అతనితో ఎవరూ సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేయడం సంచలనంగా మారింది.

దీనికి విశాల్ అంతే స్థాయిలో స్పందించాడు. మండలిలో ఉన్నప్పుడు సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల వైద్య, విద్య తదితర అవసరాల కోసం ఖర్చు పెట్టిన సంగతి తెలియదా అంటూ ఆదేశాలు జారీ చేసిన కథిరేషన్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి వైపు పరిష్కారం చూపెడితే బాగుంటుందని, విశాల్ సినిమాలు చేస్తూనే ఉంటాడని, కావాలంటే ఆపడానికి ట్రై చేయొచ్చని సవాల్ విసిరాడు. ఇప్పుడీ వ్యవహారం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. బయటవాళ్ళు తీయకపోయినా విశాల్ కే నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే.

చెన్నై టాక్ ప్రకారం దీనికి మూలం ఆ మధ్య విశాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూటర్స్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అది సిఎం కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో నడుస్తోంది. దాన్ని మనసులో పెట్టుకునే ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే తరహాలో కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక తరహాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ 2 (తుప్పరివాలన్) తీస్తున్న విశాల్ దాని మొదటి భాగం దర్శకుడు మిస్కిన్ తోనూ విభేదాలు తెచ్చుకోవడం గుర్తేగా.