పూరిని విడిచిపెట్టిన లైగర్ భూతం?

టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. కానీ గత దశాబ్ద కాలంగా ఆయనకు పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక్కటి బాగా ఆడింది. కానీ అది ఫ్లూక్ హిట్ అనిపించేలా తర్వాతి చిత్రం ‘లైగర్’ పెద్ద డిజాస్టర్ అయింది.

పూరికి డిజాస్టర్లు కొత్తేమీ కాదు కానీ.. ‘లైగర్’ ఆయన్ని మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ సినిమాతో దారుణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆయన మీద పడిపోయారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని గొడవ గొడవ చేశారు. ‘లైగర్’ రిలీజ్ తర్వాత చాలా రోజుల పాటు ఈ వివాదం నడిచింది. ఐతే బిజినెస్ డీల్స్ నుంచి తనకు రావాల్సిన డబ్బులు రాలేదని.. అవి వస్తే సెటిల్ చేస్తానని.. లేదా కొత్త సినిమా రిలీజ్ టైంలో చూసుకుందామని పూరి వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. అటు నుంచి సానుకూల స్పందన లేకపోయింది.

దీంతో అప్పట్లో పూరి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటికి బయటికి వచ్చింది. కాగా పూరి కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ‘లైగర్’ పంచాయితీ తప్పదనే అనుకున్నారంతా. ఇటీవలే ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ హక్కులను పూరి ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ నిరంజన్ రెడ్డికి అమ్మేయడంతో అనుకున్నట్లే ఫిలిం ఛాంబర్లో ‘లైగర్’ నష్టాల మీద పంచాయితీ మొదలైంది.

ఐతే ఇక్కడ జరిగిన చర్చలు, తీర్మానాల ప్రకారం పూరి సేఫ్ అని అంటున్నారు. ఒక సినిమా వల్ల బయ్యర్లు నష్టపోతే పరిహారం చెల్లించాలన్న రూల్ లేదని.. లాభాలు వచ్చినపుడు నిర్మాతకు పంచుతారా అనే వాదన నడిచిందని.. బయ్యర్లు పూరిని బ్లాక్‌మెయిల్ చేసిన నేపథ్యంలో ఆయన రివర్సయ్యారని.. ఈ నేపథ్యంలో అన్ని విషయాలూ పరిశీలించిన ఛాంబర్.. నైజాం ఏరియా వరకు ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పూరి సెటిల్మెంట్ చేయాల్సిన అవసరమేమీ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ‘లైగర్’ విషయంలో ప్రధానంగా గొడవ చేసింది నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను అండ్ కోనే. ఇక్కడ వ్యవహారం సెటిలైపోవడంతో ఇక ఆంధ్రా బయ్యర్ల విషయంలో పూరి తనకు తానుగా ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చన్నమాట.