మెగా అల్లు బంధం గురించి హైపర్ అది

ఎన్నికల సమయంలో జనసేన తరఫున పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్న హైపర్ ఆది ఇవాళ జరిగిన శివం భజే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మీద జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడ్డం ఆసక్తి రేపింది. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నేషనల్ అవార్డు సాధించిన నటుడిని అవమానించడం సరికాదని, బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఏమీ లేదని, మెగా అల్లు కుటుంబాలు రెండూ ఒకటేనని, అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేయొద్దని హితవు పలికాడు. పవన్ కళ్యాణ్ కు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పాడు.

వైసిపి అభ్యర్థికి మద్దతుగా నంద్యాలకు వెళ్లి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ని కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసుకోవడం వల్లే ఇప్పుడీ ప్రస్తావన రావడం, దానికి హైపర్ ఆది మెచ్యూర్ గా సమాధానం ఇవ్వడం విశేషం. బన్నీ సపోర్ట్ చేసిన శిల్పా రవిచంద్రరెడ్డి ఓడిపోవడం ఈ ఇష్యూని మరింత హైలైట్ అయ్యేలా చేసింది. పవన్ కళ్యాణ్ నిజంగానే ఇలాంటివి సీరియస్ గా పట్టించుకోకపోయినా అభిమానులు అలా చూడలేదు. ప్రచారం చివరి రోజు రామ్ చరణ్ పిఠాపురం వెళ్ళినప్పుడే బన్నీ నంద్యాలకు వెళ్లడం గురించే వాళ్ళు తీవ్రంగా చర్చించుకున్నారు.

మొత్తానికి హైపర్ ఆది రెండు కుటుంబాలు ఒకటేనని చెప్పడం మంచి సంకేతమే. ఇద్దరు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రచ్చ దీని వల్ల పూర్తిగా ఆగుతుందని చెప్పలేకపోయినా జాతీయ అవార్డు సాధించిన బన్నీకి తగినంత గౌరవం ఇవ్వాలని చెప్పడం సముచితమే. ఇప్పుడు దీని వల్ల ట్రోలింగ్ అమాంతం తగ్గుతుందని కాదు కానీ కొంతవరకు తీవ్రతని తగ్గిస్తుంది. పుష్ప 2 ది రూల్ విడుదల సమయానికి ఈ అంశం తాలూకు ప్రభావం ఉంటుందని బన్నీ ఫ్యాన్స్ కొందరు అనుమానపడొచ్చేమో కానీ ఆ ఎఫెక్ట్ ఎంత మాత్రం ఉండదని చెప్పొచ్చు. డిసెంబర్ 6 దానికీ స్పష్టత వచ్చేస్తుంది.