ఓంకార్ తమ్ముడు మళ్ళీ విభిన్నంగానే

స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా తెరకు పరిచయమైన అశ్విన్ బాబు సినిమాలు చేయడం తగ్గించినా అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాడు. గత ఏడాది రిలీజైన హిడింబలో డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పటికీ ప్రేక్షక ఆమోదం పొందలేదు. ప్రయత్నం పరంగా పేరైతే వచ్చింది కానీ కాన్సెప్ట్ హ్యాండిల్ చేసిన విధానంలో తడబాటం వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు శివం భజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అశ్విన్. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ ఆగస్ట్ 1 రిలీజ్ కానుంది. ఇవాళ ట్రైలర్ ద్వారా మూవీలో ఏముందో చెప్పే ప్రయత్నం చేశారు.

ఇండియాని మ్యాప్ లో లేకుండా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న పాకిస్థాన్ దాని కోసం ప్రమాదకమైన శక్తులను రంగంలోకి దించుతుంది. దీని వల్ల అనూహ్య పరిస్థితుల్లో ఎందరో హత్యకు గురవుతారు. ఈ మిస్టరీని ఛేదించడం పోలీస్, సిబిఐకు అంతు చిక్కని సవాల్ గా మారుతుంది. బాధితులుగా మారిన వాళ్లలో ఓ యువకుడు(అశ్విన్ బాబు) ఉంటాడు. ప్రాణాలతో బయట పడి ఇదంతా చేస్తున్నది ఎవరో తెలుసుకునేందుకు రంగంలో దిగుతాడు. అయితే కార్యసాధనను మానవశక్తితో పాటు దైవ సహాయం కూడా తోడ్పడుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే తెరమీద చూడాలి.

కాన్సెప్ట్ ఆసక్తికరంగానే అనిపిస్తోంది. మర్దర్ మిస్టరీ చుట్టూ అల్లినప్పటికీ దానికి శివుడుతో ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడో జై చిరంజీవలో విలన్ గా నటించాక మళ్ళీ కనిపించలేదు. మురళి శర్మ, బ్రహ్మజి, తులసి, హైపర్ ఆది ఇలా పెద్ద క్యాస్టింగ్ నే పెట్టుకున్నారు. వికాస్ బడిస నేపధ్య సంగీతం థీమ్ ని ఎలివేట్ చేసేలా ఉంది. కల్కి 2898 ఏడి తర్వాత భారతీయుడు 2, డార్లింగ్ నిరాశ పరిచిన నేపథ్యంలో ఆగస్ట్ లో శివమ్ భజే ఏమైనా బోణీ కొడుతుందేమో చూడాలి.