ఫోన్ పేతో ఈగ విలన్ డిష్యుం డిష్యుం

ఈగ, బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న కిచ్చ సుదీప్ కు ఫోన్ పే సంస్థతో జగడం వచ్చింది. అదేంటో అర్థం కావాలంటే వివరాల్లోకి వెళ్ళాలి. ఇటీవలే కర్ణాటక సర్కారు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కొలువుల్లో స్థానికులకు పెద్ద పీఠ వేసేలా జిఓ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనిపట్ల ఆ రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఫోన్ పే సిఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదని, ఉద్యోగానికి కొలమానం ప్రతిభ తప్ప స్థానికత కాదని ఆయన వాదన. ఇదే వివాదానికి దారి తీసింది.

తమ ప్రయోజనాలకు అడ్డు తగిలేలా సమీర్ మాట్లాడ్డం పట్ల కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఫోన్ పేకు బ్రాండ్ అంబాసడర్ గా సుదీప్ ఉన్నారు. దీంతో అందరి దృష్టి ఆయనపైకి వెళ్ళింది. మాతృభాష, రాష్ట్రం పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శించే సుదీప్ కు ఈ పరిణామం ఆగ్రహం కలిగించింది. దీంతో ప్రజలకు మద్దతు తెలుపుతూ ఫోన్ పేకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు రెడీ అవుతున్నారు. ఒకవేళ సదరు కంపెనీ నుంచి క్షమాపణ రాని పక్షంలో ఇకపై ఆ సంస్థకు పని చేయనని చెప్పబోతున్నట్టు బెంగళూరు టాక్. దీనికి సంబంధించి రేపో ఎల్లుండో ప్రకటన లేదా ప్రెస్ మీట్ జరగొచ్చట.

ఇదే కాదు ఓటిటి, సినిమా టికెట్ల మీద అదనపు పన్ను విధించే అంశం కూడా కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అమలు చేయలేదు కానీ శాసనసభలో ఆమోదం పొందాక చర్యలు తీసుకుంటారు. సుదీప్ స్పందించిన తీరు పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఇతర నటీనటులు కూడా స్థానికత అంశం మీద సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఫోన్ పేని వాడకూడదంటూ కన్నడిగులు క్యాంపైన్ మొదలుపెట్టి యాప్ తీసేయడం, స్కానర్లను తీసేయడం లాంటివి చేస్తున్నారట. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరగనుందో.