తేజు సినిమాతో తాడోపేడోనే..

‘వెన్నెల’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లాంటి క్లాసిక్ తీసిన దర్శకుడు దేవా కట్టా. ఈ సినిమా తర్వాత అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాల్ని అతను అందుకోలేకపోయాడు. ‘ఆటోనగర్ సూర్య’, ‘డైనమైట్’, హిందీ ‘ప్రస్థానం’ లాంటి డిజాస్టర్లు ఇచ్చాడు.

అంత గొప్పగా కెరీర్ ఆరంభించాక దేవా నుంచి ఇలాంటి సినిమాలు తీస్తాడ‌ని ఎవరూ ఊహించలేదు. ఐతే కాలం కలిసిరాక, రాంగ్ ప్రాజెక్టులు ఎంచుకోవడంతో గాడి తప్పాడు కానీ.. దేవాలో విషయానికి లోటు లేదన్నది చాలామంది నమ్మకం. ఆ నమ్మకంతోనే యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్‌.. దేవాతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. మెగా ఫ్యామిలీ పెద్దలు కూడా కథ విని ఆ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమా దేవాకు లైఫ్ అండ్ డెత్ టైపు మూవీ అనడంలో సందేహం లేదు.

తన కెరీర్లో అత్యంత కష్టపడి, ఎక్కువ సమయం తీసుకుని దేవా చేస్తున్న సినిమా ఇది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీకి పవన్ కళ్యాణ్ కొంత స్ఫూర్తిగా నిలిచాడని దేవా ఇంతకముందే సంకేతాలు ఇచ్చాడు.

లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా.. షూటింగ్‌లు ఆగిపోయిన గత ఆరు నెలల కాలంలో దేవా తన టీంతో కలిసి మరింత పకడ్బందీగా స్క్రిప్టును రెడీ చేశాడు. ఇప్పుడు హాలీవుడ్ ఫిలిం మేకర్స్ చేసినట్లు తన టీంతో కలిసి ప్రిపరేషన్ వర్క్ చేస్తున్నాడు దేవా. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ట్విట్టర్లో ఇచ్చాడు.

Twelve-aspect Mise-En-Scene session అంటూ ఈ సినిమాకు సంబంధించిన వివిధ విభాగాల హెడ్‌లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు దేవా. ఈ సెషన్‌కు పెట్టిన పేరుకు అర్థమేంటని హీరో సాయిధరమ్.. ట్విట్టర్లో అడిగితే.. ఆ పన్నెండు విభాగాలేంటో ఒక ఫొటో ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు దేవా.

ఈ కాన్వర్జేషన్ చూశాక దేవా.. ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడో.. దీని కోసం ఎంతగా సన్నద్ధమవుతున్నాడో అర్థమవుతోంది. తన కెరీర్‌ను నిర్దేశించే ఈ సినిమాతో అతను తాడో పేడో తేల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబరు మధ్య నుంచి షూటింగ్ ఆరంభమవుతుందని కూడా దేవా ఈ సందర్భంగా వెల్లడించాడు.