చిరంజీవిని ఫిదా చేసిన వశిష్ట ప్లానింగ్

వందల కోట్ల బడ్జెట్ తో ఫాంటసీ సినిమా అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నప్పుడు దర్శకుడి మీద చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. ఊహించని విధంగా వచ్చే బడ్జెట్ అడ్డంకులు, ఆర్టిస్టుల కాల్ షీట్లు, విఎఫెక్స్ కంపెనీల ఆలస్యాలు ఒకటా రెండా రాసుకుంటూ పోతే చాంతాండంత లిస్టు అవుతుంది. కానీ వశిష్ట పక్కా ప్లానింగ్ తో విశ్వంభర లాంటి గ్రాండియర్ ని పూర్తి చేసే దిశగా పరుగులు పెట్టడం చిరంజీవిని ఫిదా చేసినట్టు యూనిట్ టాక్. మూడు పాటలతో సహా దాదాపు టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ చేసి ఇంట్రో సాంగ్ తో పాటు క్లైమాక్స్ భాగాన్ని మాత్రం త్వరలోనే తీయబోతున్నారు.

మాములుగా అయితే యువి సంస్థలో ఏదీ ముందు అనుకున్న రీతిలో జరగదనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలకు ఇది ఋజువయ్యింది కూడా. విశ్వంభరకూ అదే రిపీట్ అవుతుందని అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా వసిష్ఠ వేసుకున్న షెడ్యూలింగ్ మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఆస్కార్ విజేత కీరవాణితో సాంగ్స్ చేయించుకోవడంతో మొదలుపెట్టి త్రిష లాంటి బిజీ ఆర్టిస్టులతో కో ఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ బ్రేక్ రాకుండా చేసుకున్న వైనం బడ్జెట్ ని కూడా తగ్గిస్తుంది. అసలైన సవాల్ పోస్ట్ ప్రొడక్షన్ రూపంలో ఈ నాలుగైదు నెలల్లో ఎదురు కానుంది.

2025 జనవరి 10 విడుదలని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ పక్కాగా ఉంటుందని టీమ్ నుంచి అందుతున్న సమాచారం. ఒక లక్ష్యం కోసం ఎన్నో లోకాల్లో సాహస యాత్ర చేసే భీమవరం దొరబాబుగా చిరు పాత్ర ఇందులో మంచి మాస్ గా ఉంటుందని ఆల్రెడీ టాక్ ఉంది. అంజి తర్వాత మళ్ళీ ఈ జానర్ ని టచ్ చేయని మెగాస్టార్ ని తెరమీద చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జై టింగ్ గా ఉన్నారు. భోళా శంకర్ తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో విశ్వంభర సాలిడ్ కంబ్యాక్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.