భార‌తీయుడిని వదిలేసిన శంక‌ర్

ఈ రోజుల్లో సినిమాను రిలీజ్ చేశాం.. త‌మ ప‌నైపోయింద‌ని హీరో, ద‌ర్శ‌కుడు అనుకుంటే క‌ష్టం. విడుద‌ల త‌ర్వాత కూడా సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయాలి. ప్ర‌మోష‌న్లు కొన‌సాగించి వ‌సూళ్లు పెంచ‌డానికి ట్రై చేయాలి. కానీ రిలీజ్ త‌ర్వాత ప్ర‌మోష‌న్లు కొన్ని సినిమాల‌కే క‌లిసి వ‌స్తాయి. కొన్ని చిత్రాల‌కు ఏం చేసినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అలాంటి చిత్రాల‌ను హీరోలు, దర్శ‌కులు ప‌ట్టించుకోవ‌డం మానేసి త‌మ ప‌నిలో ప‌డిపోతారు. ఇప్పుడు లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంకర్ అదే ప‌ని చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

విడుద‌ల ముంగిట భార‌తీయుడు-2ను వీళ్లిద్ద‌రూ ఎంత బ‌లంగా ప్ర‌మోట్ చేశారో తెలిసిందే. తెలుగులోనూ పెద్ద ఈవెంట్లో పాల్గొన్నారు. త‌ర్వాత మీడియాను మీట‌య్యారు. కానీ రిలీజ్ త‌ర్వాత అటు త‌మిళంలో కానీ, ఇటు తెలుగులో కానీ ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేవు.

శంక‌ర్ అయితే విడుద‌లైన మూడో రోజుకే ఇండియ‌న్-2 సంగ‌తి ప‌క్క‌న పెట్టేసి హైద‌రాబాద్ వ‌చ్చేశాడ‌ని స‌మాచారం. ఆయ‌న త‌న త‌ర్వాతి చిత్రం గేమ్ చేంజ‌ర్ మీద ఫోక‌స్ చేస్తున్నార‌ట‌. మిగిలిన 10-15 రోజుల షూట్ కోసం ఆయ‌న ప్లానింగ్‌లో ప‌డిపోయాడ‌ట‌. లొకేష‌న్లు చూస్త‌న్నార‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ పునఃప్రారంభం అవుతుంద‌ని.. సింగిల్ షెడ్యూల్లో మిగ‌తా సినిమాను పూర్తి చేసి ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మీద కూర్చోవాల‌ని శంక‌ర్ చూస్తున్నాడ‌ట‌. గేమ్ చేంజ‌ర్ హిట్ కావ‌డం శంక‌ర్‌కు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇండియ‌న్-2 గురించి బాధ ప‌డుతూ కూర్చోవ‌డానికి ఛాన్స్ లేదు. గేమ్ చేంజ‌ర్‌ను ది బెస్ట్‌గా తీర్చిదిద్ది ప్రేక్ష‌కుల‌కు అందించాలి. మ‌ళ్లీ హిట్టు కొట్టి త‌నేంటో రుజువు చేసుకోవాలి. అప్పుడే కెరీర్ నిల‌బ‌డుతుంది. ఇండియ‌న్-3కి అంతో ఇంతో బ‌జ్ రావాల‌న్నా కూడా గేమ్ చేంజ‌ర్ హిట్ట‌వ‌డం చాలా అవ‌స‌రం కాబ‌ట్టి త‌న ఫోక‌స్ మొత్తాన్ని ఆ చిత్రం మీదికి మ‌ళ్లించాడ‌ట‌శంక‌ర్.