రవితేజతో పీపుల్స్ మీడియా నాలుగోసారి

మాస్ మహారాజా రవితేజతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సింక్ కుదిరిపోయింది. పక్కా ప్లానింగ్ తో వేగంగా సినిమాలు తీయడంలో ముందున్న ఈ బ్యానర్ తో పని చేసేందుకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లే అంగీకారం తెలిపినప్పుడు స్పీడ్ కు మారుపేరైన రవితేజ ఆగుతారా. ఇప్పటిదాకా ఈ కాంబోలో మూడు చిత్రాలొచ్చాయి. ధమాకా బ్లాక్ బస్టర్ కాగా ఈగల్ అంచనాలు అందుకోలేకపోయినా ప్రయత్న పరంగా ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్ రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ నిర్మాణంలో ఉండగానే బజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి శ్రీకారం చుట్టబోతున్నారని టాక్.

దర్శకుడు బాబీతో ఒక ప్రాజెక్టు సెట్ చేసే పనిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉన్నట్టు సమాచారం. ఇతన్ని ఇండస్ట్రీకి పవర్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. అది సూపర్ హిట్ కావడంతోనే వెంకీ మామ లాంటి మల్టీస్టారర్లు వెతుక్కుంటూ వచ్చాయి. వాల్తేరు వీరయ్యలో హీరో చిరంజీవే అయినా తనకిచ్చిన పాత్ర ప్రాధాన్యం, బాబీతో వ్యక్తిగతంగా ఉన్న బాండింగ్ వల్ల రవితేజ అందులో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరూ ఒక కథ అనుకోవడం, నచ్చడం జరిగిపోయాయట. బాలయ్య 109లో బిజీగా ఉన్న బాబీ డిసెంబర్ లోగా దాని ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఫ్రీ అవుతాడు.

ప్రజల మనిషి టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ లెక్కన ఏదో పవర్ ఫుల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ బాబీ సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే పేరుతో గతంలో సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల డైరెక్షన్లో ఒక సినిమా చేశారు. తర్వాత ఎవరూ వాడుకోలేదు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ టాక్ అయితే ఉంది. మాస్ రాజాని మంచి ఎలివేషన్లతో చూపించడం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే బాబీ ఈసారి కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తాడని అభిమానుల నమ్మకం. మిస్టర్ బచ్చన్, సితార బ్యానర్ సినిమా అవ్వగానే రవితేజ చేయబోయే ప్రాజెక్టు ఇదే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.