అర్థరాత్రి హైడ్రామ్ క్రియేట్ చేసిన లావణ్య

రీల్ క్రైమ్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న రియల్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో ప్రధానంగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఉండటం.. ఆయన్ను గతంలోనే పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతూ లావణ్య సీన్లోకి రావటం.. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో హీరోయిన్ మాల్వీతో తాజాగా రాజ్ తరుణ్ ఉంటున్నట్లుగా వరుస ఆరోపణలతో ఈ వ్యవహారం డైలీ బేసిస్ లో చర్చనీయాంశంగా మారింది. టీవీ చానళ్లకు మంచి మేత దొరికినట్లుగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంలో డ్రగ్స్ కేసు ఎంట్రీ ఇవ్వటంతో.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.

శుక్రవారం అర్ధరాత్రి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ – లావణ్య వివాదంలో తనను తాను బాధితురాలిగా చెప్పుకుంటున్న లావణ్య చేసిన పనితో పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. తనకు రాజ్ తరుణ్ కావాలంటూ అదే పనిగా చెబుతున్న లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది. తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నట్లుగా లాయర్ తో చాట్ చేసిన ఆమె.. డయల్ 112కు ఫోన్ చేసింది. దీంతో.. హుటాహుటిన లావణ్య ఇంటికి వెళ్లిన నార్సింగ్ పోలీసులు.. ఆమెను రెస్కూ చేసినట్లుగా చెబుతున్నారు.

“ఈ లోకంలో నా పయనం పూర్తైంది. అందుకే ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను. నేనేమిటో తెలిసిన మనుషులే నన్ను తప్పు పట్టారు. నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. మైండ్ గేమ్.. గాసిప్స్ తో విసిగిపోయాను’’ అంటూ చేసిన చాట్ తో అలెర్టు అయిన నార్సింగ్ పోలీసులు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను కాపాడారు. ఈ సందర్భంగా లావణ్య మరిన్ని వ్యాఖ్యలు చేశారు.

తాను నమ్మిన వారే తనను మోసం చేశారని.. మస్తాన్ కేసులో తాను కీలుబొమ్మ అయినట్లుగా పేర్కొన్నారు. తన భర్త రాజ్ తరణ్ ను తనకు ఇవ్వాలని మాల్వీని బతిమిలాడినా ఆమె వినలేదన్న లావణ్య.. తన చావుకు కారణం రాజ్ తరుణ్.. అతడి తల్లిదండ్రులుగా పేర్కొంది. అంతేకాదు తన చావుకు ప్రధానకారణంగా మాల్వీ మలోత్రగా లావణ్య ఆరోపించింది. మొత్తంగా ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాలకు కొత్త ట్విస్టు ఇచ్చిన లావణ్య సూసైడ్ అటెంప్టు వ్యవహారం ప్రస్తుతానికి ఆమె సేఫ్ అయ్యారు. అయితే.. ఆమె తీరు పోలీసులకు చుక్కలు చూపిస్తోందన్న మాట వినిపిస్తోంది.