రాజ్ తరుణ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తన మీద అభియోగాలతో లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇటీవలే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లకు పైగా కలిసి ఉంటూ తనను మోసం చేశాడని, తిరగబడరా సామీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తమ బంధంలో చీలికలు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేసింది. అదే రోజు రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఒకప్పుడు సహజీవనం చేసిన మాట వాస్తవమేనని, కానీ డ్రగ్స్ కి ఆమె అలవాటు పడ్డ స్వంత ఇంటిని వదిలేసి వచ్చానని చెప్పడం జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తగినన్ని సాక్ష్యాలు తీసుకొస్తేనే కేసు నమోదు చేస్తామని నార్సింగ్ పోలీసులు చెప్పడంతో లావణ్య ఈ రోజు వాటిని సమర్పించినట్టు సమాచారం. ఆమె అందించిన ఆధారాల అనుగుణంగా డిపార్ట్ మెంట్ వైపు నుంచి విచారణ మొదలైంది. మరోవైపు తన మీద అనవసరంగా నిందలు వేస్తోందని మాల్వీ మల్హోత్రా సైతం లావణ్య మీద మొన్నే కంప్లయింట్ ఇచ్చింది. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిసినట్టే ఉంది. అయితే తన ప్రకారం చెబుతున్న వెర్షన్ కు అనుగుణంగా సాక్ష్యాలు తీసుకురాగలిగితే డిఫెన్స్ బలంగా ఉంటుంది.

ఏది ఏమైనా రెండు కొత్త సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న టైంలో జరుగుతున్న పరిణామాలు రాజ్ తరుణ్ కి ఇబ్బందిగా పరిణమిస్తాయి. ఎందుకంటే అవి వాయిదా పడితే నిర్మాతలకు ఆర్ధిక భారం పెరుగుతుంది. వీలైనంత త్వరగా నిర్దోషిగా తేలకపోతే జనాల్లో నెగటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఇది బాగున్న సినిమాలను దెబ్బ కొట్టే ప్రమాదం లేకపోలేదు. మరి రాజ్ తరుణ్ కేసు ఎలాంటి మలుపులు తిరిగి క్లైమాక్స్ కు చేరుకుంటుందో చూడాలి. ఒక ఇమేజ్ ఉన్న అప్ కమింగ్ హీరో చుట్టూ ఇలాంటి వివాదం చెలరేగడం గత కొన్నేళ్లలో ఇదేనని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ అయ్యాక నిజాలు తేలుతాయి.