చరణ్ అభిమానుల నిరీక్షణ ఫలించింది

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ పాడుకుంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే గేమ్ ఛేంజర్ షూటింగ్ లో తన భాగం వరకు తమ హీరో షూటింగ్ పూర్తి చేసుకుని బయటికి వచ్చేశాడు కాబట్టి. ఇక్రిసాట్ లో జరిగిన షెడ్యూల్ లో చరణ్ కు సంబంధించిన సీన్స్ ని దర్శకుడు శంకర్ పూర్తి చేశాడు. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 కోసం మెగా పవర్ స్టార్ సిద్ధమయ్యే సమయం వచ్చేసింది. అయితే గతంలో ప్రచారం జరిగినట్టు ఆగస్ట్ లో ఉంటుందా లేక మరికొంత ఆలస్యమవుతుందా అనేది వేచి చూడాలి. మేకోవర్ కోసం కొంత సమయం అవసరం పడుతుందని గతంలోనే టాక్ వచ్చింది.

చిత్రీకరణ పూర్తయినా గేమ్ ఛేంజర్ పనులు ఇంకా బోలెడు పెండింగ్ ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయాలి. డబ్బింగ్ మొదలుపెట్టాలి. అందరూ పెద్ద ఆరిస్టులే కావడంతో డేట్లు సర్దుబాటు చేసి వీలైనంత త్వరగా ఈ తతంగం లేట్ కాకుండా చూడాలి. ఇండియన్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్న శంకర్ జూలై నాలుగో వారం నుంచి పూర్తిగా ఫ్రీ అవుతారు. అప్పటి నుంచి పూర్తిగా గేమ్ ఛేంజర్ మీద ఫోకస్ ఉంటుంది. విడుదల తేదీ ఇంకా నిర్ధారణ కాలేదు.ఎన్నో నెలల తర్వాత ఎస్విసి ట్విట్టర్ హ్యాండిల్ లో గేమ్ ఛేంజర్ పోస్టర్ ని హెడర్ లో పెట్టడం గమనించాల్సిన విషయం.

సరే ఏదైతేనేం చరణ్ బయటికి వచ్చాడు. మూడేళ్ళకు పైగా జరిగిన సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు దొరికింది.రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా విభిన్న షేడ్స్ పోషించిన రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. తమన్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. జరగండి జరగండికి కొంత మిశ్రమ స్పందన వచ్చినా తెరమీద చూశాక సాంగ్స్ కి వచ్చే స్పందన వేరే లెవెల్ లో ఉంటుందని పని చేసినవారు అంటున్నారు. అక్టోబర్ రిలీజ్ సాధ్యమయ్యేలా లేదు కనక నిర్మాత దిల్ రాజు డిసెంబర్ ఆప్షన్ ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు వినికిడి.