రియా నాలుగు వారాలు జైల్లోనే..

వివిధ భాష‌ల్లో న‌‌టిస్తున్న ఓ సినీ క‌థానాయిక దాదాపు నెల రోజులు జైలు జీవితం గ‌డ‌పాల్సి రావ‌డం అంటే క‌ఠిన‌మైన విష‌య‌మే. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొని పోలీసుల విచార‌ణ ఎదుర్కొని.. ఆపై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల క‌స్ట‌డీలోకి వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తికి ఇదే ప‌రిస్థితి త‌లెత్తింది.

ఎన్సీబీ అధికారులు రియాను ఈ నెల‌ 9న రిమాండుకు తరలించిన సంగ‌తి తెలిసిందే. కోర్టు విధించిన రెండు వారాల గడువు మంగ‌ళ‌వారం ముగియ‌గా.. ఎన్‌డీపీఎస్ కోర్టు ఆ కస్టడీని అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రియా ఇంకో రెండు వారాలు కస్టడీలోనే ఉండనుంది. ఈ రెండు వారాలూ ఎన్సీబీ అధికారులు రియాను విచారించనున్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ కస్టడీని కూడా అక్టోబర్ 6 వరకు కోర్టు పొడిగించింది. రియా లాయర్ ఆమె బెయిల్ కోసం ఇప్ప‌టిదాకా చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

మ‌రోసారి బెయిల్ పిటిష‌న్ వేయ‌గా.. బుధ‌వారం ముంబ‌యి కోర్టులో ఆ పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది. రియా డ్ర‌గ్స్ తీసుకోవ‌డంతో పాటు త‌న సోద‌రుడి ద్వారా ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టుల‌కు వాటిని స‌ర‌ఫ‌రా చేసేద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. విచార‌ణ‌లో భాగంగా ర‌కుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ స‌హా ప‌లువురు తార‌ల పేర్లు ఆమె వెల్ల‌డించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్లో డ్ర‌గ్ రాకెట్‌ను ఛేదించ‌డానికి రియాను కీల‌క ఆధారంగా ఎన్సీబీ అధికారులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.