రెట్టింపు స్థాయిలో దత్తుగారి పుత్రికోత్సాహం

కంటే కూతుర్నే కను అని దాసరి నారాయణరావు గారు ఒక సినిమా తీశారు. మగపిల్లల కంటే ఆడపిల్లల ఆప్యాయత, తెగింపు వాళ్ళకే ఎక్కువ ఉంటాయనే సందేశంతో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే రీచ్ అయ్యింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే నిర్మాత అశ్వినీదత్ ఇప్పుడీ పుత్రికోత్సాహాన్ని రెట్టింపు స్థాయిలో ఆస్వాదిస్తున్నారు కాబట్టి. బాక్సాఫీస్ దగ్గర కల్కి 2898 ఏడి నిర్మాతగా ఆయన పేరు మారుమ్రోగుతూ ఉండొచ్చు కానీ దాని వెనుక ఇద్దరు కుమార్తెలు స్వప్న, ప్రియాంకలు పడ్డ కష్టం, నాలుగేళ్లుగా చేసిన శ్రమ గొప్ప ఫలితం అందుకునే దిశగా వెళ్తోంది.

దర్శకుడు నాగ అశ్విన్ స్వయంగా అశ్వినీదత్ అల్లుడే అయినప్పటికీ కల్కికి సంబంధించిన డైరెక్షన్ ఒత్తిడితో తను ప్రొడక్షన్ వైపు చూసే పరిస్థితిలో లేడు. అందుకే ఆ బాధ్యతను స్వప్న, ప్రియాంకలు తలకెత్తుకున్నారు. స్వప్న సినిమా బ్యానర్ మీద అప్పటికే మీడియం రేంజ్ సినిమాలు తీసిన అనుభవం ఉన్నప్పటికీ కల్కి గ్రాండియర్ కథ వేరు. తండ్రి అనుభవంతో వ్యాపారాన్ని డీల్ చేయగలరేమో కానీ క్షేత్ర స్థాయిలో ప్రొడక్షన్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఈ ఇద్దరే పర్యవేక్షించాల్సి వచ్చింది. అందులోనూ యాభై వందా కాదు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడిన ప్యాన్ ఇండియా ప్రాజెక్టు.

రెండు మూడు వాయిదాలు పడినప్పటికీ జూన్ 27 విడుదలకు కట్టుబడి టార్గెట్ ని రీచ్ కావడంలో స్వప్న, ప్రియాంకలు చేసిన కృషి అమోఘమని చెప్పాలి. భారీ ప్రమోషన్లు చేయలేదు. ఎంత అవసరమో దానికే కట్టుబడ్డారు. అతిశయోక్తులకు పోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకుండా కేవలం ముంబై ప్రెస్ మీట్ తో సరిపెట్టి తెలివిగా వ్యవహరించారు. దత్తుగారి మరో కుమార్తె స్రవంతి కూడా చేదోడువాదోడుగా ఉంటారు. హైప్ విషయంలో పబ్లిసిటీ జరగడం లేని ఫీలవుతున్న ఫ్యాన్స్ ఈ రోజు రికార్డులు చూసి మురిసిపోతున్నారంటే దానికి కారణం రిలీజ్ కు ముందున్న నిర్మాతల నమ్మకమే.