ఏపీకి క్యూ క‌డుతున్న సినీ ఇండ‌స్ట్రీ.. రీజ‌నేంటి?

తెలుగు సినీ రంగం.. ఏపీకి క్యూక‌డుతోంది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో ఏపీ అంటేనే దేబిరించుకునే ప‌రిస్థితిలో ఉన్న సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడు.. ప్ర‌భుత్వం మార‌డం.. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా సినీ రంగానికే చెందిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌డంతో ఏపీకి వ‌స్తోంది. తాజాగా సీనిరంగానికి చెందిన ప్ర‌ముఖుల స‌మాచారం మేర‌కు.. సీనియ‌ర్ నిర్మాత‌లు.. సోమ‌వారం ఏపీకి వ‌స్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చ‌ర్చించ‌నున్నారు. అదేస‌మ‌యంలో పెట్టుబ‌డులు.. స్టూడియోల నిర్మాణంపైనా ఆయ‌న‌తో చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిసింది.

కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ని కోరనున్నారు. ప్ర‌ధానంగా గ‌త వైసీపీ స‌ర్కారు తీసుకున్న టికెట్ల ధ‌ర‌ల పెంపు లేదా త‌గ్గింపు నిర్ణ‌యాల‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కొన్నాళ్లు టాలీవుడ్ కోరుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయా సమ‌స్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించ‌నున్నారు.

మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో నిర్మాత‌లు చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ ని కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు,దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.

ఏం జ‌రుగుతుంది?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డంలో.. సినీ రంగం కూడా ప్ర‌ముఖ పాత్ర పోషించింది. చిన్న న‌టుల నుంచి మెగాస్టార్ వ‌ర‌కు.. వారి వారి స్థాయిలో ప్ర‌చారం చేశారు. నిధులు కూడా స‌మ‌కూర్చారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వారికి ఎలాంటి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. విశాఖ ప‌ట్నంను సినీ ఇండ‌స్ట్రీకి హ‌బ్‌గామార్చే ఉద్దేశం ఉంద‌ని.. గ‌తంలో చంద్ర‌బాబు చెప్పారు. అక్క‌డ రామానాయుడు స్టూడియో కూడా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినీరంగానికి ఎలాంటి తీపిక‌బురు అందిస్తార‌నేది చూడాలి. కాగా.. సోమ‌వారం.. కేబినెట్ భేటీ కూడా ఉన్న విష‌యం తెలిసిందే.