బన్నీ ఎందుకు ‘నో’ చెప్పాడంటే

అంతా సెట్ అయ్యింది, పుష్ప 2 ది రూల్ తర్వాత మొదలుపెట్టడమే ఆలస్యం అనుకున్న అల్లు అర్జున్ – దర్శకుడు అట్లీ కలయికలో ప్యాన్ ఇండియా మూవీ హఠాత్తుగా తప్పుకోవడం వెనుక అందరూ రెమ్యునరేషన్ ఇష్యూలు అనుకున్నారు కానీ వాస్తవానికి వేరే కారణం ఉందట. అట్లీ రాసుకున్న కథలో ఇద్దరు హీరోలకు స్కోప్ ఉందట. సమానంగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా ప్రాధాన్యం విషయంలో ఒకటే అనే రేంజ్ లో డిజైన్ చేశాడట. ఒకవేళ బన్నీ ఒప్పుకుంటే ఒక బాలీవుడ్ స్టార్ ని భాగం చేయడం ద్వారా మార్కెట్ పరంగా స్కేల్ పెంచవచ్చనేది అట్లీ మనసులో ఉన్న ప్లాన్.

పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చాక అల్లు అర్జునే కాదు ఏ హీరో అయినా మల్టీస్టారర్లు చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. రాజమౌళి అంతటి వాడే బ్యాలన్స్ చేసే విషయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరిని పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేక పోయాడు. అలాంటిది బన్నీతో వేరే హీరో కాంబో అంటే ఏ మాత్రం తేడా కొట్టినా ఫలితం అటుఇటు అయిపోతుంది. నో చెప్పడానికి ఇది ప్రధాన కారణమని అంతర్గతంగా వినిపిస్తోంది. దీన్నే తీసుకెళ్లి సల్మాన్ ఖాన్ కు చెప్పి ఒప్పించి సన్ పిక్చర్స్ నిర్మాణంలో తీసేందుకు అట్లీ సర్వం సిద్ధం చేశాడని చెన్నై టాక్.

సల్మాన్ ఖాన్ కు మరో స్టార్ ఉంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. ఇప్పుడు మెయిన్ హీరో తనే కాబట్టి సెకండ్ రోల్ కోసం అట్లీ దక్షిణాదిలో ఎవరైనా పెద్ద హీరోని సెట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమా ఇచ్చినా సరే అట్లీ రొటీన్ కమర్షియల్ దారిలో వెళ్లే సంగతి హీరోల దృష్టిలో ఉంది. మార్కెట్ లెక్కల్లో వర్కౌట్ అవుతున్న మాట వాస్తవమే కానీ ప్రతిసారి అవే ఫలితాలను ఆశించలేం. మరి అల్లు అర్జున్ ఇదంతా ఆలోచించుకునే డ్రాప్ అయ్యుండొచ్చనేది గీత వర్గాల నుంచి అందిన సమాచారం. కొన్నికొన్ని వదులుకోవడమే మంచిదేమో మరి.