బుచ్చిబాబు కోసం చరణ్ రెట్టింపు కష్టం

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందాని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ తర్వాతి సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం తాలూకు స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధమయ్యింది. ఆగస్ట్ నుంచి మొదలవ్వొచ్చనే టాక్ ఉంది కానీ చరణ్ పాల్గొనే రెగ్యులర్ షూటింగ్ మాత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఉండొచ్చని యూనిట్ టాక్. దానికి ప్రత్యేకమైన కారణముంది. ఆర్సి 16లో చరణ్ పాత్రకు ఇప్పటిదాకా చేయని మేకోవర్ అవసరం. ముఖ్యంగా శారీరకంగా కఠినమైన మార్పులు కావాలట.

దీని కోసమే రామ్ చరణ్ త్వరలో ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నట్టు తెలిసింది. రెండు నెలల పాటు ప్రత్యేకంగా ఒక ట్రైనర్ సమక్షంలో శిక్షణ తీసుకుని తిరిగి రాబోతున్నట్టు తెలిసింది. గతంలో ఆర్ఆర్ఆర్ కోసం ఇదే తరహా కష్టం పడినప్పటికీ ఈసారి అంతకు రెండు మూడింతలు ఉంటుందట. స్పోర్ట్స్ టచ్ ఉన్న బ్యాక్ డ్రాప్ కావడంతో చరణ్ దృఢత్వం మీద పలు ఎపిసోడ్లు ఆధారపడి ఉంటయని తెలిసింది. మహారాజా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో ఈ స్టోరీ తనకు తెలుసని, సూపర్ డూపర్ హిట్ ఖాయమని బుచ్చిబాబుతోనే అన్న మాటలు వైరలవుతున్నాయి.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆర్సి 16 క్యాస్టింగ్ కు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2025 విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ ఈ సంవత్సరం గేమ్ ఛేంజర్ రిలీజైతేనే అది సాధ్యపడుతుంది. అయితే బుచ్చిబాబు పెట్టుకున్న స్కేల్, కంటెంట్ గురించిన వార్తలు వింటూ ఉంటే ఒక్క ఏడాదిలో షూటింగ్ అయిపోయేలా కనిపించడం లేదు. పుష్ప 2 ది రూల్ తర్వాత బుచ్చిబాబు గురువు సుకుమార్ చేయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులు మొదలవుతాయి. అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది.