వరుణ్ తేజ్ రూటు మార్చాడు కానీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు బాక్సాఫీస్ తత్వం బోధపడుతోంది. ప్రయోగాల పేరుతో బాలీవుడ్ స్టైల్ లో ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకుని వరసగా మూడు డిజాస్టర్లు తగిలేసరికి మార్కెట్ రిస్క్ లో పడింది. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి మరొకటి దెబ్బ కొట్టడమే కానీ అంతకు ముందు వచ్చిన డీసెంట్ ఓపెనింగ్స్ ని సైతం అమాంతం తగ్గించేశాయి. వీటి ప్రభావం ఎంత ఉందంటే నిర్మాణంలో ఉన్న మట్కా సైతం కుదుపులకు లోనవుతోంది. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఇతనో లవ్ స్టోరీకి ఓకే చెప్పాడనే వార్త అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద హిట్స్ గా నిలిచిన ఫిదా, తొలిప్రేమ రెండూ ఈ జానర్ వే. ఎఫ్ 2, ఎఫ్ 3లో వెంకటేష్ డామినేషన్ ఉంటుంది కనక వాటిని పరిగణనలోకి తీసుకోలేం. రూటు మార్చడం వరకు సంతోషమే కానీ దీనికి దర్శకుడు విక్రమ్ సిరికొండ కావడమే అసలు ట్విస్టు. రవితేజకు టచ్ చేసి చూడు రూపంలో షాక్ ఇచ్చింది ఇతనే. ఎన్నో బ్లాక్ బస్టర్లలో రచయితగా, సహాయకుడిగా గొప్ప పనితనం ఉన్న విక్రమ్ డైరెక్షన్ డెబ్యూకి మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకున్నాడు.

టచ్ చేసి చూడు తర్వాత మళ్ళీ కనిపించనే లేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే కథ చాలా డిఫరెంట్ గా వచ్చిందని, అందుకే విక్రమ్ గత చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ ఓకే చెప్పాడని అంటున్నారు. మరో బలమైన కారణం ఉంది. దీనికి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కావడం. కంటెంట్ లేనిదే ఈ బ్యానర్ లో అంత సులభంగా అవకాశం దొరకదు. మరి విక్రమ్ సిరికొండ ఒప్పించాడంటే మ్యాటర్ ఏదో ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాక్ కాలేదు కనక ప్రకటన వచ్చే దాకా ఫ్యాన్స్ వేచి చూడాలి మరి.