ఆరు నెలల డెడ్ లైన్ పెట్టుకున్న దిల్ రాజు

వీలైనంత వరకు సంక్రాంతికి తన నిర్మాణంలో ఉండే సినిమా రిలీజయ్యేలా చూసుకోవడం దిల్ రాజు పాటించే సంప్రదాయం. ఒకవేళ కొన్నిసార్లు మిస్ అయినా ఆ సంవత్సరం ఏదైనా పెద్ద హీరో మూవీ డిస్ట్రిబ్యూషన్ కొనడం ద్వారా ఆ లోటుని తీర్చుకుంటారు. మొన్న పండక్కు గుంటూరు కారంని ఎక్కువ రేట్లకు పంపిణి చేయడం వెనుక కారణం ఇదే.

అంతకు ముందు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, తెగింపు లాంటి విపరీత పోటీ ఉన్నా సరే నెరవకుండా రెండు రోజులు ఆలస్యంగా వారసుడు తెచ్చి వర్కౌట్ చేసుకున్నారు. దీని వల్లే కొన్ని విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది.

ఈసారి అలాంటి సమస్య రాకుండా ఎస్విసి నుంచే ఒక సినిమా విడుదల చేయాలని దిల్ రాజు పట్టుదలగా ఉన్నారు. ముందు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనుకున్నారు. కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తమ ఫ్యామిలీ హీరో ఆశిష్ కు ప్రమోషన్ ఇవ్వాలనేది ఆయన ప్లాన్.

కానీ కంటెంట్ ఎంత బాగున్నా చిరంజీవి విశ్వంభర, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, రవితేజ – భాను భోగవరపు కాంబోలతో పోటీ పడటం అంత సులభంగా ఉండదు. కాబట్టి దాని స్థానంలో వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి జనవరి రేసులో నిలబెట్టాలనేది ఇప్పటిదాకా అనుకున్న ప్లాన్.

వెంకటేష్ ప్రస్తుతం రానా నాయుడు 2 షూటింగ్ కోసం ముంబై హైదరాబాద్ మధ్య ట్రిప్పులు కొడుతున్నారు. వెబ్ సిరీస్ కావడంతో ఎక్కువ డేట్లు ఇచ్చారు. మధ్యలో అవాంతరాలు బ్రేకులు ఉండనే ఉంటాయి. అది పూర్తయితే తప్ప రావిపూడికి కావాల్సిన కొత్త మేకోవర్ కి షిఫ్ట్ కాలేరు. జూన్ ని మినహాయిస్తే చేతిలో ఆరు నెలల సమయం మాత్రమే ఉంటుంది. వీలైనంత డిసెంబర్ వచ్చేలోపే చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు పంపాలి. అనిల్ రావిపూడికి వేగంగా తీయడం కష్టం కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెడ్ లైన్ ని అందుకోవడం సులభం కాదు. దిల్ రాజు మాత్రం తగ్గేదేలే అంటున్నారట.