రౌడీ బాయ్ సరసన మిస్టర్ బచ్చన్ భామ

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకి ఇంకా టాలీవుడ్ డెబ్యూ రిలీజ్ కాకుండా మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. కొంత టాకీ పార్ట్, ఒకటి రెండు పాటలు మినహాయించి వేగంగా పూర్తి చేశారని సమాచారం. నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఇదిలా ఉండగా భాగ్యశ్రీ బోర్సేని మరో క్రేజీ ఆఫర్ వరించిందని లేటెస్ట్ అప్డేట్.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ విడి 12 (టైటిల్ ఇంకా నిర్ధారించలేదు)లో విజయ్ దేవరకొండకు జోడిగా భాగ్యశ్రీ బోర్సేని లాక్ చేసుకున్నట్టు సమాచారం. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ అగ్రిమెంట్ అయిపోయిందని తెలిసింది. చిత్రీకరణ జరుగుతున్నప్పటికీ యూనిట్ ఇంకా అధికారిక అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టలేదు. మొన్న రౌడీ హీరో బర్త్ డే సందర్భంగా సింపుల్ గా విషెస్ చెప్పేసి ఊరుకున్నారు. దీని సంగతలా ఉంచితే ఇది భాగ్యశ్రీ బోర్సేకి డబుల్ ప్రమోషన్ అనే చెప్పాలి.

ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు కానీ ఎవరనేది ఫైనల్ చేయలేదు. ప్రాజెక్టు ప్రకటించినప్పుడు శ్రీలీలను తీసుకుని ఆ తర్వాత ఇతరత్రా కారణాల వల్ల రీ ప్లేస్ మెంట్ చూసుకోవాల్సి వచ్చింది. మరో ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ ని తీసుకున్నారట. సోలోగా హిట్స్ దక్కించుకోలేకపోతున్న ఈ టాలెంటెడ్ హీరో ఆ మధ్య గాడ్ ఫాదర్ లో విలన్ గా చేస్తే పేరొచ్చింది కానీ బ్రేక్ ఇవ్వలేదు. ఇటీవలే కృష్ణమ్మ సైతం నిరాశపరిచింది. తిన్ననూరి సినిమా అంటే బోలెడు ఎమోషన్లు. ఈసారి పీరియాడిక్ యాక్షన్ తోడవ్వడంతో ఓ రేంజ్ లో ఆశించవచ్చు. 2025 విడుదల ప్లాన్ చేస్తున్నారు.