విలన్ కోసం అఖండ 2 వేట

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబో హీరో దర్శకుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు బాలకృష్ణ, బోయపాటి శీను. ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు సాధించడం వీళ్ళకే చెల్లింది. సింహా, లెజెండ్, అఖండ సృష్టించిన రికార్డుల గురించి అభిమానులు ఎప్పుడూ గర్వంగా ఫీలవుతూ ఉంటారు. ఒకప్పుడు బి గోపాల్ సొంతం చేసుకున్న ఈ ఫ్యాన్ క్రేజ్ ఇప్పుడు బోయపాటి అందుకున్నాడు. మరోసారి ఈ కలయిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఎన్బికె 109 చేస్తున్న బాలయ్య ఎన్నికల కోసం బ్రేక్ తీసుకుని త్వరలో సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు.

ఫలితాలు రాగానే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు. ఇదిలా ఉండగా బాలయ్య బోయపాటి కాంబో మూవీ అఖండ 2నేనని వినిపిస్తోంది. ఇది నిజమో కాదో ఖచ్చితమైన నిర్ధారణ లేదు కానీ ప్రతినాయకుడి కోసం మాత్రం తీవ్రమైన వేట కొనసాగుతోందని తెలిసింది. బాలకృష్ణకు వరసగా ఇద్దరు బాలీవుడ్ విలన్లు పని చేశారు. వాళ్ళు అర్జున్ రామ్ పాల్, బాబీ డియోల్. ఇప్పుడు దీన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నారట. సంజయ్ దత్ మొదటి ఆప్షన్ గా చూస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సంజు చాలా బిజీగా ఉన్నాడు. డేట్లు దొరకడం కష్టంగా ఉంది. డబుల్ ఇస్మార్ట్ కి దొరకడమే లక్కనుకున్నారు.

ఒకవేళ నిజంగా సంజయ్ దత్ దొరికితే మంచిదే కానీ సాధ్యం కాకపోతే ఏం చేయాలనే దాని మీద బోయపాటి వర్కౌట్ చేస్తున్నారు. అఖండలో అసలు పరిచయం లేని ఆర్టిస్టుని తీసుకొచ్చినా స్క్రీన్ మీద బ్రహ్మాండమైన విలనిజం పండేలా చేశారు. దానికి శ్రీకాంత్ తోడవ్వడంతో ఓ రేంజ్ లో పేలింది. ఇప్పుడు కూడా అదే తరహాలో జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్కంద చేసిన గాయం నుంచి రికవర్ కావాలంటే బోయపాటి శీనుకి ఇది హిట్ కావడం చాలా అవసరం. అన్నట్టు ఈసారి పొలిటికల్ టచ్ కాస్త ఎక్కువగానే ఉంటుందట. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఫుల్లుగా దట్టించడం ఖాయం.