మణిరత్నం దారి పట్టిన గుణశేఖర్

దర్శకుడు గుణశేఖర్ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒక్కడు, చూడాలని ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ని బాలనటుడిగా పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ కూడా ఆయన ఖాతాలోనే ఉంది. అయితే వరస పరాజయాలు ఈ క్రియేటివ్ జీనియస్ ని వెనుకబడేలా చేశాయి.

రుద్రమదేవిని ఆపసోపాలు పడి తెరకెక్కిస్తే మంచి ఫలితమే దక్కింది కానీ బాహుబలి స్థాయిలో మేజిక్ చేయలేక పోయింది. వరుడు లాంటి డిజాస్టర్ ఇచ్చినా సరే కేవలం గుణశేఖర్ మీద నమ్మకంతో అల్లు అర్జున్ అందులో గోనగన్నారెడ్డిగా నటించి ఆ సినిమా విజయంలో అనుష్కతో పాటు తనవంతు పాత్ర పోషించాడు.

ఇక శాకుంతలం పెద్ద ట్రాజెడీ. విషాదం కూడిన ఇతిహాసాలను భారీ బడ్జెట్ తో తీయడం ఎప్పటికీ రిస్కేనని గుర్తించకపోవడం వల్ల అది మిగిల్చిన నష్టాలు అన్నీ ఇన్ని కావు. భాగస్వామిగా వచ్చి చేరిన దిల్ రాజు సైతం తీవ్రంగా ప్రభావితం చెందారు.

దీని దెబ్బకే ఎంతో ఇష్టపడి కష్టపడి రాసుకున్న హిరణ్యకసిపతో పాటు మరో పీరియాడిక్ డ్రామాని పక్కన పెట్టాల్సి వచ్చింది. రానాతో వేరే ప్రొడక్షన్ హౌస్ తీసే ప్లాన్ లో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే గుణశేఖర్ పూర్తిగా రూటు మార్చి ఇవాళ యుఫోరియా అనే కొత్త మూవీని ప్రకటించారు. నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు లేకుండా కేవలం టైటిల్ రివీల్ జరిగింది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో అందరూ కొత్తవాళ్లే ఉంటారట. యూత్ ఫుల్ కంటెంట్ ని తీసుకున్నారని వినికిడి. హఠాత్తుగా ఇలా రూటు మార్చుకోవడం వెనుక సహేతుకమైన కారణం కనిపిస్తోంది. గుణశేఖర్ ముందు తన కంబ్యాక్ ని బలంగా నిరూపించుకోవాలి. అది కూడా వీలైనంత తక్కువ బడ్జెట్ లో. లేనిపోని ఖర్చు చేసుకుంటూ పోతే బిజినెస్ టైంలో ఇబ్బందవుతుంది. మణిరత్నం సైతం ఇలాంటి బ్యాడ్ ఫేజ్ ని చూసి ఓకే బంగారం, పొన్నియిన్ సెల్వన్ తో ఎలా అయితే ఋజువు చేసుకున్నారో గుణశేఖర్ కూడా అదే తరహాలో పక్కా ప్రణాళికతో యుఫోరియాని ప్లాన్ చేసుకున్నారట. మంచిదే.