ఆ వార్తలు ఎవరు పుట్టించారో-ప్రశాంత్ వర్మ

హనుమాన్ మూవీతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం ఉత్తరాదిన కూడా చాలా బాగా ఆడింది. దీంతో బాలీవుడ్ నటులు, నిర్మాతల కళ్లు కూడా ప్రశాంత్ మీద పడ్డాయి. ఈ క్రమంలోనే అతడితో సినిమా చేయడానికి రణ్వీర్ సింగ్ ముందుకు వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్లో సినిమాకు సన్నాహాలు చేసింది. ‘బ్రహ్మ రాక్షస’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్లో మైత్రీ వాళ్లు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఐతే ఇటీవల ఈ సినిమా కోసం ఒక రిహార్సల్ షూట్ లాంటిది చేశారని.. దానికి భారీగా ఖర్చయిందని.. ఐతే ఔట్‌పుట్‌తో పాటు ప్రశాంత్ పనితీరు నచ్చక రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని.. దీంతో మైత్రీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని జోరుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐతే ఈ వార్తల మీద పూర్తి వివరణ ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు ఉంటుందని మాత్రం మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఆ రూమర్ల గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. రణ్వీర్ సింగ్‌తో తన సినిమా పక్కాగా ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఈ ప్రాజెక్టు గురించి నిరాధారమైన వార్తలు రాశారని.. ఈ గాసిప్స్ ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని ప్రశాంత్ తెలిపాడు.

రణ్వీర్‌తో తాము చేసింది జస్ట్ లుక్ టెస్ట్ మాత్రమే అని.. అది కూడా సంతృప్తికరంగానే వచ్చిందని.. నూటికి నూరు శాతం ఈ సినిమా ముందుకు సాగుతుందని ప్రశాంత్ స్పష్టం చేశాడు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను వచ్చే ఏడాదే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దాంతో పాటుగా ప్రశాంత్ ‘బ్రహ్మ రాక్షస’నూ సమాంతరంగా తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.