సలార్ 2 ఇంతకన్నా క్లారిటీ కావాలా

సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం క్యాన్సిలైపోయిందనే వార్త నిన్న ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో టెన్షన్ వచ్చేసింది. దీనికి తోడు కొద్దిరోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో షూటింగ్ ఆగస్ట్ నుంచి ఉంటుందనే అధికారిక ప్రకటన ఈ పుకారుకి మరింత బలం చేకూర్చేలా చేసింది. తాజాగా దీనికి సలార్ టీమ్ స్పందించింది. ప్రభాస్, నీల్ ఇద్దరూ నవ్వుకుంటున్న ఒక ఫోటో పెట్టి వీళ్ళు ఆపలేరు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా క్లారిటీ వచ్చేసింది. అంటే సీక్వెల్ కి ఎలాంటి ఢోకా లేదని అర్థం

అసలా గాసిప్ ఎందుకు పుట్టిందనేది పక్కనపెడితే సలార్ 2 మీద పక్కా ప్లానింగ్ ఎప్పుడో జరిగిపోయింది. పార్ట్ టూలో ఏముండాలనేది క్యాస్టింగ్ తో సహా మొత్తం ఎప్పుడో నిర్ణయించేసుకున్నారు. జగపతి బాబు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే ప్రభాస్ డేట్లు అందుబాటులో లేని కారణంగా సలార్ 2 ఆలస్యం చేసి ఈలోగా తారక్ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది నీల్ ఆలోచనగా తెలుస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ కొనసాగింపు విషయంలో రాజీ పడేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేదనే సంగతి మళ్ళీ చెప్పనక్కర్లేదు.

కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది వెంటనే చెప్పలేని పరిస్థితి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి తర్వాత వెంటనే ది రాజా సాబ్ లో బిజీ అయిపోతాడు. స్పిరిట్ స్క్రిప్ట్ తో సందీప్ రెడ్డి వంగా సిద్ధంగా ఉన్నాడు. కల్కి రెండో భాగం తీశారా లేక ఇంకా పెండింగ్ ఉందా అనేది నాగ అశ్విన్ చెబితే తప్ప తెలియదు. ఇంకోవైపు హను రాఘవపూడి తన ప్యాన్ ఇండియా మూవీ కోసం లొకేషన్లను వెతికి పట్టుకుని వర్క్ షాపులు చేస్తున్నాడు. మూడు పాటల కంపోజింగ్ అయిపోయింది. సో సలార్ 2 శౌర్యంగపర్వం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉండొచ్చు. ఏదైతేనేం డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన తీరిపోయింది.