వరుణ్‌ను కాపాడేందుకు కమ్ముల?

మెగా ఫ్యామిలీ కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్ ఈ మధ్య తీవ్ర ఇబ్బందికరంగా తయారైంది. చాలా ఏళ్ల నుంచి అతడికి సరైన విజయం లేదు. సోలో హీరోగా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ అతడికి చేదు అనుభవాలను మిగిల్చాయి. మార్కెట్ అంతా దెబ్బ తిని తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయంలో అతనున్నాడు.

ఆల్రెడీ కమిటైన ‘మట్కా’ సినిమా అనుకున్న ప్రకారం ముందుకు కదలట్లేదు. అసలీ సినిమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతానికి వరుణ్ సైలెంట్‌గా ఉన్నాడు. ‘మట్కా’ షూటింగ్ మొదలైతే తప్ప ఈ సినిమా ఉన్నట్లు భావించలేం. ఈలోపు వరుణ్ కొత్త సినిమా ఒకటి ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది శేఖర్ కమ్ములతో కావడం విశేషం.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ నటించిన ‘ఫిదా’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అది వరుణ్ కెరీర్లో ఒక మరపురాని జ్ఞాపకం. మళ్లీ ఇప్పుడు కమ్ములతో ఓ సినిమా చేయడానికి అతను సిద్ధమయ్యాడట. ప్రస్తుతం ధనుష్‌తో ‘కుబేర’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న కమ్ముల.. దీని తర్వాత వరుణ్‌తో చేసేందుకు ఓ కథను రెడీ చేశాడట. ప్రస్తుతం కథా చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది తెలియదు. ఒక కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

‘ఫిదా’ అనగానే అందరికీ సాయిపల్లవి కూడా గుర్తుకు వస్తుంది. కాబట్టి ఆమె కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయితే దీనికి వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. మరి ఈ మూవీతో అయినా వరుణ్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.