మే 31 – కుర్ర హీరోల కుస్తీ పోటీ

సరైన సినిమాలు లేక సింగల్ స్క్రీన్లను కొన్ని రోజుల పాటు మూసేయాల్సిన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో మే చివరి వారం ఇటు బయ్యర్లు అటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మే 31 కుర్ర హీరోల కుస్తీ పోటీకి వేదిక కానుంది. వాటిలో మొదటిది గ్యాంగ్స్ అఫ్ గోదావరి.

గత ఏడాది డిసెంబర్ నుంచి రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ వయొలెంట్ విలేజ్ డ్రామా ఎట్టకేలకు మోక్షం దక్కించుకుంది. విశ్వక్ సేన్ మొదటిసారి ఊర మాస్ పల్లెటూరి గెటప్ లో కనిపిస్తుండగా నేహా శెట్టి, అంజలి గ్లామర్ డోస్ తో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వం, సితార నిర్మాణ విలువలు అంచనాలు పెంచుతున్నాయి.

హిట్ లేక ఏళ్ళు గడిచిపోతున్న కార్తికేయ భజే వాయు వేగం మీద బజ్ పెరిగేలా టీమ్ చేస్తున్న ప్రమోషన్లు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో ఓపెనింగ్ రోజు తేలనుంది. యువి సంస్థ బ్యాకప్ కావడంతో బడ్జెట్, బిజినెస్ రెండింటి పరంగా రిస్క్ లేకుండా దిగుతోంది.

బేబీ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాక ఆనంద్ దేవరకొండ నుంచి వస్తున్న గంగం గణేశా మీద తొలుత ఎలాంటి అంచనాలు లేవు కానీ ట్రైలర్ చూశాక పరిస్థితిలో మార్పు వచ్చింది. స్వామి రారా తరహాలో క్రైమ్ కామెడీ అనే నమ్మకం కుదరడంతో ఆడియన్స్ లుక్కేసే ఛాన్స్ లేకపోలేదు. ఆనంద్ విరివిగా పబ్లిసిటీలో భాగమవుతున్నాడు.

ఈ మూడు బాక్సాఫీస్ కు కొత్త ఉత్సాహం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటికో అడ్డంకి లేకపోలేదు. కేవలం నాలుగు రోజుల గ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.

ఈసారి ఖచ్చితంగా అధికారం మారుతుందనే విశ్లేషణల నేపథ్యంలో జనాలు కనక వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే దాని ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడుతుంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ యావరేజ్ అనిపించుకున్నా మొదటి వారంలో ఇబ్బంది తప్పదు. సో ఎదురుగా ఉన్న ఈ ఛాలెంజ్ ని కుర్ర హీరోలు ఎలా ఎదురుకుని విజయం సాధిస్తారో చూడాలి.