సూపర్ కలయికకు పూరి ప్రయత్నాలు

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ కోసం ముంబైలో బిజీగా ఉన్న దర్శకుడు పూరి జగన్నాధ్ దాని తర్వాత ఎవరితో చేస్తాడనే దాని గురించి సరైన క్లారిటీ లేదు. దీని ఫలితం చూశాక ఆలోచించవచ్చని కొందరు హీరోలు ఎదురు చూస్తుండగా రిలీజ్ కు ముందే ఏదైనా ప్రాజెక్టు లాక్ చేసుకోవాలని పూరి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే కొన్ని వారాల క్రితం నాగార్జునని కలిసినట్టు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం నాగ్ ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు. వీళ్లిద్దరి కలయికనగానే గుర్తొచ్చే సినిమా శివమణి. నాకు కొంచెం మెంటల్ అంటూ వెరైటీ మాస్ పోలీస్ ఆఫీసర్ గా యువసామ్రాట్ ని చూపించిన తీరు అభిమానులకే కాదు ఆడియన్స్ కి కూడా నచ్చేసి ఘనవిజయం ఇచ్చారు.

తర్వాత బాలీవుడ్ మూవీ ధూమ్ స్ఫూర్తితో సూపర్ తీసిన పూరి స్టయిలిష్ మేకింగ్ తో మెప్పించాడు కానీ కమర్షియల్ గా గొప్ప ఫలితాన్ని అందుకోలేదు. అనుష్క పరిచయం కావడమే సూపర్ వల్ల జరిగిన సూపర్ మేలు. ఎలా చూసుకున్నా దీన్ని ఫ్లాప్ అనలేం. యావరేజ్ కింద పరిగణించవచ్చు. సో సరైన కథ పడితే నాగ్ ని ఎలా ప్రెజెంట్ చేయాలో పూరికి బాగా తెలుసు. ప్రస్తుతం కుబేరలో తలమునకలైన నాగార్జున తర్వాత తమిళ దర్శకుడితో ప్యాన్ ఇండియా మూవీ సెట్ చేసుకున్నాడు. బంగార్రాజు 3 ప్లానింగ్ కూడా ఉంది కానీ స్టోరీ కుదరడం లేదు. మరి పూరికి ఏ మేరకు ఎస్ చెబుతాడో చూడాలి.

సబ్జెక్టు నచ్చితే దర్శకుడి ట్రాక్ రికార్డు నాగ్ పట్టించుకోరు. అందుకే రామ్ గోపాల్ వర్మ, ప్రవీణ్ సత్తారు లాంటి వాళ్ళు సినిమాలు చేయగలిగారు. మరి పూరి కూడా అదే క్యాటగిరీలోకి వస్తే మంచిదే. డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి జనంలోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఎక్కువగా ఉంది. లైగర్ చేసిన గాయాలను పూర్తిగా మాన్పుకునే రేంజ్ లో పూరి తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఇటీవలే రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు మిశ్రమ స్పందన రావడం కొంత షాక్ ఇచ్చినా అసలైన కంటెంట్ వేరే లెవెల్ ఉంటుందని ఊరిస్తున్నారు. చూడాలి పూరి ట్రయిల్స్ ఎక్కడిదాక వెళ్తాయో.