చిరంజీవి మాటిచ్చింది ఏ దర్శకుడికి

విశ్వంభర షూటింగ్ తప్ప వేరే ప్రపంచం లేకుండా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. గత ఏడాది కూతురు సుష్మితని ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మార్చే క్రమంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఓకే చేసి, ఆ తర్వాత భోళా శంకర్ ఫలితం చూసి వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. అదే కథను రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కొన్ని కీలక మార్పులు చేసి త్రినాథరావు నక్కినకు ఇస్తే ఆయన దాన్ని చక్కగా సందీప్ కిషన్ తో సెట్ చేసుకున్నాడు. చిరు దగ్గరకు రెగ్యులర్ గా డైరెక్టర్లు వస్తున్నారు, లైన్లు వినిపించి వెళ్లిపోతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. పవన్ కళ్యాణ్ బ్రో చేశాక అన్నయ్య సినిమా ఒకటి చేయాలనేది టిజి విశ్వప్రసాద్ టార్గెట్. ఈ కారణంగానే అమెరికాలో చిరు సన్మాన సభ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారనే టాక్ ఉంది. తమ బ్యానర్ లోనే మిస్టర్ బచ్చన్ చేస్తున్న హరీష్ శంకర్ తో ఓ స్టోరీ చెప్పించారు. కానీ అది ఫైనల్ కాలేదట. గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజా కూడా లైన్ లోనే ఉన్నాడట. కానీ అతను తమిళంలో తమ్ముడు జయం రవితో తని ఒరువన్ 2 (ధృవ సీక్వెల్)లో బిజీగా ఉన్నాడు. పూర్తయ్యేలోపు ఏడాది గడిచేలా ఉంది.

సో ఇప్పటికిప్పుడు చిరు ఎవరితో చేయబోయేది వెంటనే చెప్పలేం. పీపుల్స్ మీడియాకి ఓకే చెప్పినా ఆ ప్రాజెక్టులో సుష్మిత భాగస్వామిగా ఉంటుందట. మొత్తం ఫైనల్ కావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. హరీష్ శంకర్, మోహన్ రాజాలలో ఎవరికి ఎస్ చెప్పినా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కన్నా ముందు షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆరు నెలలు కేటాయించబోతున్న నేపథ్యంలో ఇండిపెండెన్స్ డేకన్నా ముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో వశిష్ట పని చేస్తున్నాడు. ఆరు నూరైనా జనవరి 10 విడుదలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని యువి వర్గాలు అంటున్నాయి.