రొటీన్ అంటూనే 50 కోట్లు లాగేసింది

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు రోజులు కొంత డీసెంట్ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత అమాంతం చల్లారిపోయింది. సుహాస్ ప్రసన్నవదనంకు రివ్యూస్ బాగున్నా, పబ్లిక్ పాజిటివ్ గా స్పందించినా కలెక్షన్లు మాత్రం సోసోనే. అయితే తమన్నా రాశిఖన్నాల బాక్ అరణ్మణై 4 మాస్ అండతో గట్టెక్కిపోవడం ఊహించనిది. తెలుగు డబ్బింగ్ ఫ్లాపే కానీ మాస్ సెంటర్స్ లో ఓ మోస్తరుగా లాగించగా తమిళంలో మాత్రం మొదటి వారం పూర్తి కాకుండానే యాభై కోట్ల గ్రాస్ తేవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది.

దర్శకుడు సి సుందర్ కంటెంట్, టేకింగ్ రెండూ రొటీన్ గానే ఉన్నప్పటికీ క్వాలిటీగా అనిపించిన విజువల్ ఎఫెక్ట్స్, హీరోయిన్ల గ్లామర్, మాస్ కి నచ్చే కొన్ని హారర్ ఎపిసోడ్లు వర్కౌట్ అయ్యాయి. అన్నింటికన్నా అసలే పోటీ లేకుండా సోలోగా దిగడం బాగా కలిసి వచ్చింది. ఇక్కడ బాక్ అద్భుతాలు చేయకపోయినా జరిగిన తక్కువ బిజినెస్ కు తగ్గట్టు నష్టాల శాతం తీవ్రంగా లేకుండా చూసుకోవడం ఒక్కటే కొంత ఊరట కలిగించిందని బయ్యర్స్ టాక్. దెయ్యాల కామెడీ టాలీవుడ్ జనాలకు బోర్ కొట్టేసింది. అందుకే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఎంత పబ్లిసిటీ చేసినా ప్రయోజనం దక్కించుకోలేదు.

బాక్ కూడా అదే క్యాటగిరీ కావడంతో ఎలాంటి మేజిక్ చేయలేదు. అయితే కాస్త ట్రెండీ టచ్ ఇస్తే భారీగా కాకపోయినా నిర్మాత లాభం కళ్లజూసేలా మెప్పించవచ్చని ఓం భీం బుష్ నిరూపించింది. కానీ బాక్ లో మ్యాటర్ అంత స్థాయిలో లేదు. సుందర్ సి ఇప్పుడు అయిదో భాగం కూడా తీస్తారట. హీరోయిన్లతో పాటు క్రేజీ హీరో క్యాస్టింగ్ ని సెట్ చేసుకుని స్కేల్ పెంచుతానని అంటున్నాడు. లారెన్స్ తరహాలో జనాలకు మొహం మొత్తి ఇక చాలు బాబోయ్ అనేవరకు దెయ్యం సినిమాలు వదులుతూనే ఉంటాడు కాబోలు. అన్నట్టు ఎప్పుడో ఆగిపోయిన ఈయన ప్యాన్ ఇండియా మూవీ సంఘమిత్ర మళ్ళీ వార్తలోకి వస్తోంది.