డిజిటల్ ప్రపంచంలో రామ్ ఎంట్రీ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులు డబుల్ ఇస్మార్ట్ విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అన్నీ సవ్యంగా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే జూన్ రిలీజ్ కి సిద్ధంగా ఉండేది. కానీ బయటికి చెప్పని ఏవో కారణాలతో నెలల తరబడి షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లి పునరుద్ధరించేశారు. మణిశర్మ స్వరపరిచిన రెండు మూడు పాటలతో పాటు కొంత టాకీ పార్ట్ మినహా మొత్తం పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఓటిటి రైట్స్ అమ్ముడుపోవడంతో పెద్ద టెన్షన్ తీరిపోయిందని ఇక వేగం పెంచడమే మిగిలిందని అంతర్గత సమాచారం.

దీని సంగతలా ఉంచితే రామ్ త్వరలో డిజిటల్ డెబ్యూ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు వినికిడి. వెంకటేష్ రానా నాయుడు తరహాలో నెట్ ఫ్లిక్స్ తనతో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ప్లాన్ చేయాలనుకుంటోందట. ఇద్దరు ముగ్గురు దర్శకులను ప్రతిపాదనలతో తన దగ్గరికి పంపినట్టు ఇన్ సైడ్ టాక్. కథ నచ్చితే వెంటనే పట్టాలెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేస్తారట. అయితే రామ్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రవికిశోర్ సైతం ఏం చేస్తే బాగుంటుందనే దిశగా డిస్కస్ చేస్తూ ప్రస్తుతానికి ఎస్ నో రెండూ చెప్పకుండా సమయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

నాగచైతన్య అమెజాన్ ప్రైమ్ తీసిన దూతతో ఆల్రెడీ డెబ్యూ హిట్టు కొట్టేశాడు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది కానీ స్టార్ హీరోలు రెగ్యులర్ గా వెబ్ సిరీస్ లలో కనిపించరు. మరి రామ్ మనసులో ఏముందో తెలియాలంటే ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. అసలే డబుల్ ఇస్మార్ట్ మీద బోలెడు నమ్మకం పెట్టేసుకున్నాడు. వారియర్, స్కందలు భారీ షాక్ ఇవ్వడంతో మాస్ ఇమేజ్ పరంగా కొంత ఇబ్బంది తలెత్తింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ కనక బ్లాక్ బస్టర్ ఇస్తే ఆ లోటు పూర్తిగా తీరిపోతుంది. లైగర్ ఫలితం చూశాక కూడా రామ్ ఛాన్స్ ఇచ్చాడంటే సబ్జెక్టు అంత బ్రహ్మాండంగా వచ్చిందని టీమ్ టాక్.