మణికర్ణిక పరిస్థితే వీరమల్లుకు వస్తే

గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది. తక్కువ టైంలో పరిమిత బడ్జెట్ తో బాలకృష్ణ లాంటి పెద్ద హీరోతో అంత క్వాలిటీగా తీయడం చూసి రాజమౌళి సైతం పబ్లిక్ స్టేజి మీద మెచ్చుకోవడం అందరికీ గుర్తే అయితే అది ప్రతిసారి రిపీట్ కావడం లేదు. మణికర్ణిక తీస్తున్న సమయంలో హీరోయిన్ కం నిర్మాత కంగనా రౌనత్ తో విభేదాలు వచ్చిన కారణంగా ఆ ప్రాజెక్టుని ఒకదశ దాటాక క్రిష్ వదిలేయాల్సి వచ్చింది. దాన్ని ఆమె స్వయంగా పూర్తి చేసుకుని రిలీజ్ చేయడం సంచలనం.

ఇప్పుడు హరిహర వీరమల్లుకి ఇదే సీన్ రిపీట్ కావొచ్చని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే నాలుగు సంవత్సరాల కాలాన్ని ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఖర్చు పెట్టిన క్రిష్ ఇక ఆగలేక అనుష్కతో ఘాటీ మొదలుపెట్టేశాడు. దీంతో బాలన్స్ ఉన్న వీరమల్లుని నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణతో పూర్తి చేయించే  దిశగా అడుగులు పడుతున్నాయని ఇన్ సైడ్ టాక్. రేపు వచ్చే కొత్త టీజర్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్రిష్ పేరు లేకుండా పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవచ్చు కాబట్టి మణికర్ణిక తరహాలో సంయుక్తంగా డబుల్ డైరెక్షన్ కార్డు ఏమైనా వేస్తారేమో చూడాలి. ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది.

అసలు పవర్ స్టార్ ఈ సినిమాకు డేట్లు ఇవ్వడమే సవాల్ గా మారింది. ఎన్నికలు అయిపోయి పవన్ తిరిగి సినిమా ప్రపంచంలోకి రావడానికి ఎంత లేదన్నా జూలై దాటేస్తుంది. ముందు ఓజి పూర్తి చెయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు హరిహర వీరమల్లుకు కాల్ షీట్లు ఇవొచ్చు. జ్యోతికృష్ణకు డైరెక్షన్ కొత్త కాదు కాబట్టి పెండింగ్ ఉన్న షూట్ ని ఫినిష్ చేయడం కష్టం కాదు. కాకపోతే ఇంకో రెండు మూడు పాటలు బాలన్స్ ఉన్నాయని ఆ మధ్య కీరవాణి అన్నారు. మరి వాటి సంగతేమో తేలాలి. మొత్తానికి ఈ వ్యవహారమంతా థ్రిల్లర్ మూవీలా ఉంది.