నితిన్ మీద భారీ రిస్కులే..

యువ కథానాయకుడు నితిన్ టైం ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు. 2016లో వచ్చిన ‘అఆ’ తర్వాత ఎనిమిదేళ్ల వ్యవధిలో అతడికి దక్కిన ఏకైక హిట్ ‘భీష్మ’ మాత్రమే. దానికి ముందు, వెనుక వచ్చిన నితిన్ సినిమాలన్నీ డిజాస్టర్లయ్యాయి. గత ఏడాది ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, అంతకుముందు సంవత్సరం ‘మాచర్ల నియోజకవర్గం’ అతడికి చేదు అనుభవాలే మిగిల్చాయి. ఈ రెండు చిత్రాలనూ సొంత బేనర్లో తీసి చేతులు కాల్చుకున్నాడు నితిన్.

దీంతో ఇప్పుడు రిస్కులు మానేసి బయటి బేనర్లలో సినిమాలు చేస్తున్నాడు. నితిన్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా తన కొత్త సినిమాలకు నిర్మాతలు పెద్ద బడ్జెట్లే పెడుతున్నారు. నితిన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో ‘రాబిన్ హుడ్’, వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ‘తమ్ముడు’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నితిన్‌తో ‘భీష్మ’ తీసిన వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండడంతో మైత్రీ వాళ్లు ‘రాబిన్ హుడ్’ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ సంస్థలో ఏ సినిమా తెరకెక్కినా హీరో మార్కెట్ రేంజిని మించే బడ్జెట్ పెడతారు. అలా ఈ చిత్రం మీద 45-50 కోట్ల దాకా పెట్టడానికి రెడీ అయ్యారట మైత్రీ వాళ్లు. కానీ సినిమా మధ్యలోకి వచ్చేసరికి ఖర్చులు పెరిగిపోయాయి. ఎస్టిమేటెడ్ బడ్జెట్ కంటే 40-50 శాతం ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉందట.

మరోవైపు ‘తమ్ముడు’ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదట. కేవలం ఒక యాక్షన్ ఎపిసోడ్‌కే ‘తమ్ముడు’ టీం రూ.8 కోట్లు పెడుతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర బడ్జెట్ కూడా 65-70 కోట్ల దాకా అవుతుందని సమాచారం. నితిన్ మార్కెట్ స్థాయికి ఆ బడ్జెట్ ఎక్కువ. ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్లు అయితే తప్ప రికవరీ సాధ్యం కాదు. మరి నితిన్ ఇంత భారాన్ని మోయగలడేమో చూడాలి.