రామాయణం లీక్స్ మొదలుపెట్టేశారు

Ramayana

ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్ మొదలైపోయాయి. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల గెటప్ లో సరోవరం ఒడ్డున నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్ఫింగ్ అనే అవకాశం లేకుండా ఇమేజ్ స్పష్టంగా ఉండగా దానికి బలం చేకూరేలా షూట్ గ్యాప్ లో రన్బీర్ సగదేహం ఆచ్చాదనా లేకుండా మేకప్ వేసుకుంటున్న స్టిల్ కూడా బయటికి వచ్చేసింది. జంట చూడముచ్చటగా ఉండగా ఇదంతా చూసి నిర్మాణ వర్గాలు షాక్ తిన్నాయి.

క్యాస్టింగ్ కు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. దర్శకుడు నితీష్ తివారి గోప్యత పాటిస్తూ ఎక్కువ వివరాలు బయటికి వెళ్లకుండా చూసుకుంటున్నారు. అయినా సరే క్రమం తప్పకుండ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ తదితరులు ఉన్నారనే లీక్ నెలల నుంచే చక్కర్లు కొడుతోంది. లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి అన్నారు కానీ తను అమెరికాలో ఉండటంతో ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. రామాయణం మొత్తం మూడు భాగాలుగా రూపొందుతోంది. ఇప్పుడు జరుగుతున్నది ఫస్ట్ పార్ట్ తాలూకు చిత్రీకరణ. 2025లో విడుదల ప్లాన్ చేశారు.

ఇందులో యష్ రావణుడిగా నటించడంతో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ వల్ల సుమారు నూటా యాభై కోట్లకు పైగా పారితోషికం అందుకోబోతున్నట్టు ముంబై మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే యష్ ఎంట్రీ రామాయాణ 2లో ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటిదాకా తెరమీద ఎవరూ చూపించినంత గొప్పగా రామాయణం తీస్తానని చెబుతున్న నితీష్ తివారి ఆదిపురుష్ విషయంలో వచ్చిన నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటుకి అవకాశం ఇవ్వనని అంటున్నారు. రన్బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.