శ్రావణి ఆత్మహత్య.. కొత్త కోణం

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెతో ఒకప్పుడు ప్రేమలో ఉన్న సాయికృష్ణా రెడ్డి.. ఏడాదిన్నరగా ఆమె ప్రేమిస్తున్న దేవరాజ్ రెడ్డిల మధ్య నలిగిపోవడం మూలానే ఆమె ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని వివిధ ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి కూడా తీసుకుని విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఓ ప్రముఖ సినీ నిర్మాత శ్రావణిని బాగా ఇబ్బంది పెట్టాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్మాత ఎవరా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు ఇండస్ట్రీ జనాలు. ఆ పేరు ఇప్పుడు బయటికి వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా నిర్మాత, ఆ చిత్ర కథానాయకుడు కార్తికేయ కుటుంబ సభ్యుల్లో ఒకరైన అశోక్ రెడ్డి గుమ్మకొండనే శ్రావణిని ఇబ్బంది పెట్టిన నిర్మాత అని వెల్లడైంది. ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఆర్ఎక్స్ 100’ కంటే ముందు అశోక్ రెడ్డి.. కార్తికేయను హీరోగా పెట్టి ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా తీశాడు. ఈ చిత్రంలో శ్రావణి ఒక పాత్ర చేసింది. సాయికృష్ణ సిఫారసు మేరకే అశోక్ రెడ్డి శ్రావణికి ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడట. ఆ సందర్భంగా ఆమెను లొంగదీసుకునేందుకు గట్టిగా ప్రయత్నించాడని.. ఆ తర్వాతి కాలంలో కూడా ఆమెను వేధించాడని అంటున్నారు. కొన్నాళ్ల పాటు శ్రావణి కూడా అశోక్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిందని కొందరంటుంటే.. ఆ దిశగా సాయికృష్ణ ఆమెను ఒత్తిడి చేశాడని మరో వెర్షన్ వినిపిస్తోంది.

మొత్తానికి సాయికృష్ణ, దేవరాజ్‌రెడ్డిలతో పాటు అశోక్ రెడ్డి కూడా పరోక్షంగా శ్రావణి ఆత్మహత్యకు కారణమయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన మీద ఆరోపణలు, పోలీసు కేసు నేపథ్యంలో కార్తికేయ కుటుంబం ఇప్పుడు ఆందోళనలో పడింది. ఈ కేసులో చివరికి ఏం తేలుతుందో చూడాలి మరి.