పీవీఆర్ వెర్స‌స్ మాలీవుడ్.. క‌థ సుఖాంతం

రెండు రోజులుగా ఇండియాస్ లార్జెస్ట్ మ‌ల్టీప్లెక్స్ ఛైన్ పీవీఆర్‌కు, మ‌ల‌యాళ ఫిలిం ఇండ‌స్ట్రీకి మ‌ధ్య పెద్ద వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా పీవీఆర్ మ‌ల్టీప్లెక్సుల్లో ఎక్క‌డా మ‌ల‌యాళ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌ట్లేదు. మ‌ల‌యాళ డ‌బ్డ్ వెర్ష‌న్ల‌ను సైతం హైద‌రాబాద్ లాంటి చోట్ల పీవీఆర్ వాళ్లు ఆపేశారు.

మ‌రోవైపు మ‌ల‌యాళ ఫిలిం ఇండ‌స్ట్రీ కూడా ఇక‌పై త‌మ కంటెంట్ ఏదీ పీవీఆర్ వాళ్లకు ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఇది ఇరు వ‌ర్గాల‌కూ న‌ష్టం చేకూర్చే ప‌రిణామంగా భావించారు. ఐతే శ‌నివారం సాయంత్రం ఈ వివాదం ప‌రిష్కారం అయిన‌ట్లు తెలుస్తోంది. పీవీఆర్ మ‌ల్టీప్లెక్సుల్లో తిరిగి మ‌ల‌యాళ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈమేర‌కు ఇరు వ‌ర్గాల మ‌ధ్య అంగీకారం కుదిరింది.

థియేట‌ర్ల‌లో వీపీఎఫ్ ఛార్జీలు మ‌రీ ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని.. ఓవైపు థియేట‌ర్ల‌కు రెంట్లు క‌డుతూ, ఇంకోవైపు వీపీఎఫ్ ఛార్జీలు కూడా భ‌రించాలంటే నిర్మాత‌ల‌కు చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని.. అందుకే సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు చౌక‌గా ఉండే వేరే టెక్నాల‌జీని అందుబాటులోకి తెచ్చి దాన్నే థియేట‌ర్ల‌లో అమ‌ర్చుకోవాల‌ని మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధులు కోరారు. ఇందుకు పీవీఆర్ యాజమాన్యం ఒప్పుకోలేదు.

ఈ క్ర‌మంలోనే ఆ మల్టీప్లెక్సుల్లో మ‌ల‌యాళ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఆగిపోయింది. ఐతే ఇరు వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌ల అనంత‌రం స‌మ‌స్య ప‌రిష్కారం అయింది. ఐతే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ కోరిన‌ట్లు కొత్త టెక్నాల‌జీని అమ‌ర్చుకోవ‌డానికి పీవీఆర్ వాళ్లు అంగీక‌రించారా.. లేక పీవీఆర్ దారిలోకే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు వ‌చ్చారా అన్న‌ది తెలియ‌దు. మొత్తానికి స‌మ‌స్య అయితే తాత్కాలికంగా ప‌రిష్కారం అయింది. ఫాహ‌ద్ ఫాజిల్ న‌టించిన ఆవేశంతో పాటు నివిన్ పౌలీ మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుని ఈ స‌మ‌స్య వ‌ల్ల రెండు రోజులు వ‌సూళ్లు కోల్పోయాయి.