పివిఆర్ ఐనాక్స్ నిర్ణయానికి బాయ్స్ బలి

PVR Cinemas

ఇవాళ హఠాత్తుగా పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో మంజుమ్మల్ బాయ్స్ ప్రదర్శనలు హఠాత్తుగా నిలిపేయడం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. రంజాన్ సెలవు దినం కావడంతో హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఈ షాక్ తగలడం ఊహించనిది. సింగల్ థియేటర్లు, ఏషియన్ లాంటి ఇతర చైన్స్ లో ఇబ్బంది లేకపోయినా హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో అధిక శాతం స్క్రీన్లు పివిఆర్ గొడుగు కిందే ఉన్నాయి. దాంతో సహజంగా వాటిలో చూసే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. అసలు ఈ సమస్యకు మూలం మల్లువుడ్ లో తేలింది.

కేరళలో ఇటీవలే పిసిడి అనే కొత్త డిజిటల్ కంపెనీ వెలిసింది. థియేటర్ కంటెంట్ ని అందించడం దీని ప్రధాన వ్యాపారం. మలయాళ నిర్మాతలు మూకుమ్మడిగా దీని ద్వారానే షోలు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే షేరింగ్ పర్సెంటెజ్ ల పట్ల అభిప్రాయ భేదాలు వచ్చిన పివిఆర్ యాజమాన్యం దీనికి అంగీకరించలేదు. మల్లువుడ్ ప్రొడ్యూసర్లు ససేమిరా అన్నారు. దీంతో మలయాళ సినిమాలు వేయమని ఐనాక్స్ నిర్ణయించుకుని ఇవాళ మంచి బజ్ తో ఉన్న మూడు కొత్త రిలీజులతో సహా అన్ని స్క్రీనింగ్స్ ఆపేసింది. దీంతో కోట్ల రూపాయల నష్టం ఇద్దరికీ వచ్చింది.

మధ్యలో ఎలాంటి సంబంధం లేని తెలుగు హక్కులు కొన్న మైత్రి మూవీ మేకర్స్ ని సంప్రదించకుండా మంజుమ్మాల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ని ఆపేయడంతో డిస్ట్రిబ్యూటర్లు షాక్ తిన్నారు. సెలవు రోజు సినిమా చూడాలన్నా అందుబాటులో లేకపోవడంతో మూవీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఘమేఘాల మీద దీని గురించి సాయంత్రం టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇంత దారుణంగా ఎలాంటి సమాచారం లేకుండా షోలు ఎలా రద్దు చేస్తారనే దాని మీద పలు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏది ఏమైనా మంచి హాలిడే నాడు బాయ్స్ బలి కావడం జరిగిపోయింది.