శ్రీలీల పోయె.. భాగ్యశ్రీ వచ్చె

‘ఫ్యామిలీ స్టార్’తో మరో ఎదురు దెబ్బ తిన్నాడు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ‘లైగర్’ అతడికి దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. దానికి ముందు, తర్వాత కూడా సరైన ఫలితాలు రాలేదు. ‘ఖుషి’ కూడా ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ‘ఫ్యామిలీ స్టార్’తో అయినా రాత మారుతుందని అనుకుంటే.. అది కూడా తీవ్ర నిరాశనే మిగులుస్తోంది. ఇక ఈ సినిమా సంగతి వదిలేసి తర్వాతి చిత్రం మీద దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాను త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు విజయ్.

ఈ చిత్రానికి ముందు కథానాయికగా అనుకున్నది శ్రీలీలను. ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలుకాకపోవడం, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్‌గా నటించాల్సి ఉండడంతో శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి.

కారణాలేవైనప్పటికీ శ్రీలీల అయితే ఈ ప్రాజెక్టులో లేదు. త్వరలో సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా హీరోయిన్ వేట గట్టిగానే సాగుతోంది. ఒక దశలో ‘ప్రేమలు’ హీరోయిన్ మమిత బైజు పేరును కూడా పరిశీలించారట. కానీ చివరికి ‘మిస్టర్ బచ్చన్’తో మాస్ రాజా రవితేజతో జత కడుతున్న ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సేను ఈ చిత్రంలో కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. విజయ్ పక్కన భాగ్యశ్రీ బాగా సూటవుతుందని భావిస్తున్నారు.

‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి ఎంత మంచి పేరు సంపాదించాడో తెలిసిందే. కానీ దాని హిందీ వెర్షన్ ఫ్లాప్ అయింది. తర్వాత రామ్ చరణ్‌తో ఓ సినిమా అనుకున్నాడు కానీ.. వర్కవుట్ కాలేదు. చివరికి విజయ్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది.