ఆ లెజెండరీ హిట్‌కు 30 ఏళ్లు

తెలుగు సినిమా చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిన మేజర్ హిట్లలో ‘బొబ్బిలి రాజా’ ఒకటి. 90వ దశకంలో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘బొబ్బిలి రాజా’కు స్థానం ఉంది. 1990 వేసవిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా.. అదే ఏడాది సెప్టెంబరు 14న వచ్చిన ‘బొబ్బిలి రాజా’ దానికి దీటుగా వసూళ్లు రాబట్టి ఆ ఏడాదికి సెకండ్ మేజర్ హిట్‌గా నిలిచింది.

వెంకటేష్‌ కెరీర్లో అప్పటికి అదే అతి పెద్ద హిట్. ఇంకా ఈ సినిమా విషయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రామానాయుడి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నిర్మాతల్లో ఒకరిగా ఎదిగిన సురేష్ బాబుకు ప్రొడ్యూసర్‌గా ఇదే తొలి చిత్రం. అప్పటిదాకా సురేష్ ప్రొడక్షన్స్‌ను రామానాయుడే నడిపిస్తూ ఉండేవారు. ‘బొబ్బిలిరాజా’తో సురేష్ పగ్గాలందుకున్నారు. అరంగట్రంలోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ ఇచ్చి నిర్మాతగా తన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించారాయన.

ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా విశేషాలను తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నారు. అప్పటికే స్టేట్ రౌడీ, లారీ డ్రైవర్ లాంటి హిట్ సినిమాలు తీసిన బి.గోపాల్‌ను దర్శకుడిగా పెట్టుకుని, పరుచూరి బ్రదర్స్ అందించిన స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని నిర్మించాడు సురేష్ బాబు.

ఐతే ఈ సినిమాకు కథానాయికగా ముందు రాధను సురేష్ అనుకోగా.. పరుచూరి గోపాలకృష్ణ ఆమె అయితే కొత్తగా అనిపించదని చెప్పి దివ్యభారతి పేరు సూచించారట. ఇక హీరోయిన్ తల్లి పాత్రను తాము శారదను దృష్టిలో ఉంచుకుని రాస్తే.. ఆ పాత్రకు వాణిశ్రీ అయితే కొత్తగా ఉంటుందని ఆమెను తీసుకొచ్చింది సురేష్ అని చెప్పారు గోపాలకృష్ణ.

సినిమా చిత్రీకరణ మొదలై కొన్ని రోజులకు దర్శకుడు బి.గోపాల్ సత్తా మీద సురేష్ బాబుకు సందేహాలు రాగా.. ఇంత పెద్ద సంస్థ ఆయన్ని తీసేస్తే కెరీర్ పాడవుతుందని, తాము చూసుకుంటామని చెప్పి కొనసాగనిచ్చారట. ఈ సినిమాకు ముందు తాను ఒక వెర్షన్ రాస్తే.. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రెండో వెర్షన్‌ను తన అన్నయ్య వెంకటేశ్వరరావు చాలా వరకు మార్చారని.. ఆయన ఇచ్చిన టచ్‌తో సినిమా స్వరూపమే మారిపోయిందని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

సినిమాలో ముందు ‘బలపం పట్టి..’ మూడో పాటగా రావాల్సిందని.. కానీ ఐదో పాటగా వస్తే సినిమా రేంజ్ మారుతుందని తాను చెప్పానని.. ముందు సురేష్ ఒప్పుకోకున్నా తర్వాత అలాగే మార్చారని.. ఇలా అన్ని మార్పులూ చేర్పులూ కలిసొచ్చి ‘బొబ్బిలిరాజా’ చారిత్రక విజయం సాధించిందని ఆయన గుర్తు చేసుకున్నారు.