లక్ష టికెట్లు అమ్మేసిన రాకాసి ప్రాణులు

మనం టిల్లు స్క్వేర్ మీద ఫోకస్ పెట్టాం కానీ హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మీద అంచనాలు మాములుగా లేవని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇంకా రెండు రోజులు ఉండగానే లక్షకు పైగానే టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ రిపోర్ట్. కౌంటర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓపెనింగ్ డేకి మంచి రికార్డు నమోదవుతుందని లెక్క వేస్తున్నారు. కేవలం మూడు మల్టీప్లెక్సుల నుంచే 50 వేలకు పైగా టికెట్లు సేల్ కావడం క్రేజ్ ని సూచిస్తోంది. మూడు కోట్లకు దగ్గరగా ఉన్న గ్రాస్ ఈ వారాంతంలోపు రెండింతలు ఎక్కువగా నమోదు చేసే అవకాశం ఉంది.

ముందు నుంచి ఈ సిరీస్ మీద పిల్లలు, యూత్ లో భారీ హైప్ నెలకొంది. దానికి తోడు ఈసారి ట్రైలర్ హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. త్రీడి, ఐమ్యాక్స్, 4డిఎక్స్ ఇలా అన్ని ఫార్మాట్లలో వేర్వేరు ప్రింట్లను రిలీజ్ చేస్తున్నారు. దీని వల్ల మనకొచ్చిన ఇబ్బందేంటంటే టిల్లు స్క్వేర్, గోట్ లైఫ్ ఆడు జీవితంలకు అంతో ఇంతో గాడ్జిల్లా కాంగ్ నుంచి ప్రభావం ఉంటుంది. పైగా సెలవులు ఎంజాయ్ చేస్తున్న పిల్లలు ఖచ్చితంగా దీన్నే ఫస్ట్ ఛాయస్ గా పెట్టుకుంటారు. అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేయడం వల్ల  డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి మద్దతు దక్కుతోంది. ఇండియా మొత్తం 5500 పైగా షోలు వేస్తున్నారు.

ఇవి కాకుండా కలియుగ పట్టణంలో, తలకోనతో పాటు క్రేజీ హీరోయిన్లు నటించిన బాలీవుడ్ మూవీ క్రూ బరిలో దిగుతోంది. ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే టిల్లు స్క్వేర్ తర్వాత కాంగ్ వర్సెస్ గాడ్జిల్లానే నిలుస్తోంది. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఐపీఎల్, ఎండ సెగలను తట్టుకుని కొత్త సినిమాలు భారీగా జనాలను రప్పించాలని థియేటర్లు ఎదురు చూస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి నాలుగు హిట్లు పడినా ఓ మూడు వారాలు బలంగా ఆడిన బ్లాక్ బస్టర్ ఏదీ లేదు. ఆ లోటు తీరాలంటే రేపు భారీ బోణీ జరిగి దాన్ని ఏప్రిల్ లో  విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కొనసాగించాలి.