ఇంత యాక్షన్ తట్టుకోలేం మియా

గత రెండు మూడేళ్ళుగా బాలీవుడ్ లో శత్రుదేశంని అదే పనిగా విలన్ గా చూపిస్తూ దాని చుట్టే హీరోయిజంని నడిపించే సినిమాలు ఎక్కువైపోయాయి. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ ఇదే ఫార్ములాని టైగర్ 3లో ప్రయోగించబోతే జనం వద్దనేశారు. ఏదో వసూళ్లు బాగానే వచ్చినా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్వాగతం దక్కలేదు. ఫైటర్ లోనూ ఇదే చేశారు కానీ హృతిక్ రోషన్ ఇమేజ్ పుణ్యమాని మరీ డిజాస్టర్ కాకుండా నిలబడింది. ఇప్పుడు కొత్తగా అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్ లు బడేమియా చోటేమియా అంటూ ఏప్రిల్ 10 రంజాన్ పండగను టార్గెట్ గా పెట్టుకుని వస్తున్నారు.

సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ ఇవాళ విడుదలయ్యింది. మూడు నిమిషాలకు పైగా నిడివిలో ఈజీగా ఊహించే కథను అరటిపండు వలిచినట్టు చెప్పేశారు. ఒకడు ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేస్తూ దేశానికి చీడపురుగులా మారతాడు. అతనెలా ఉంటాడో ఎవరికి తెలియదు. వీడిని పట్టుకోవడం కోసం గవర్నమెంట్ సైకో ఆర్మీ ఆఫీసర్లుగా పేరున్న బడే మియా, చోటే మియాలను రంగంలోకి దించుతుంది. ఇంత పెద్ద రక్షణ వ్యవస్థ చేయలేని పనిని వాళ్లిద్దరూ ప్రాణాలకు తెగించి పూర్తి చేస్తారు.

యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత గ్రాండియర్ గా ఉన్నా అతిశయోక్తి అనిపించే బ్లాస్టులు, ఛెజులతో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ సినిమా మొత్తాన్ని చెవులు పగిలేలా హోరెత్తించేలా ఉన్నాడు. అక్షయ్, టైగర్ ఇద్దరూ గత కొంత కాలంగా ఫామ్ లో లేరు. అలాంటిది టైంలో ఇంత ఓవర్ ది బోర్డ్ వయొలెన్స్ తో వస్తే ట్రోలింగ్ చేయకుండా నెటిజెన్లు ఉంటారా. కొత్తగా ఆలోచించకుండా చేతిలో బడ్జెట్ ఉంది కదాని పదే పదే అవే కథలతో పబ్లిక్ ముందుకు వస్తుంటే ఎలా. ఈద్ పండగ కాబట్తి ఓపెనింగ్స్ కి ఢోకా లేకపోవచ్చు కానీ బాక్సాఫీస్ దగ్గర నెగ్గుకురావడం అంత సులభమైతే కాదు.