పచ్చజెండా ఊపేసిన నాగ్

వరుస ఫెయిల్యూర్లతో సతమతం అయిన సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు సంక్రాంతి సినిమా ‘నా సామి రంగ’ గొప్ప ఉపశమనాన్ని అందించింది. కంటెంట్ పరంగా యావరేజే అయినా.. సంక్రాంతి టైంలో ఈ సినిమా బాగానే ఆడి హిట్ అనిపించుకుంది. దీంతో ఉత్సాహంగా కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు కింగ్. ఆల్రెడీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి ‘కుబేర’ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు నాగ్. దీని తర్వాత తమిళ దర్శకుడు నవీన్‌తో సినిమాకు ఆయన పచ్చజెండా ఊపేసినట్లు సమాచారం.

నాగ్‌తో నవీన్ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమిళంలో ‘మూడర్ కూడం’ అనే చిన్న సినిమాతో మంచి పేరు సంపాదించాడు నవీన్. అతను ఓ కథతో గత ఏడాది నాగ్‌ను సంప్రదించాడు. అప్పట్నుంచి జరుగుతున్న కథా చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

నాగ్-నవీన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని అంటున్నారు. ఇందులో వేర్వేరు భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు చేస్తారని.. ఇదొక మల్టీస్టారర్ తరహాలో ఉంటుందని సమాచారం. సూర్య కజిన్, తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

ఇది నాగ్ వందో సినిమానా కాదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ మైల్‌స్టోన్ మూవీని తెలుగువాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చేయడానికి చూశాడు నాగ్. కానీ ఆ కాంబో కుదరలేదు. తన స్థానంలోకి నవీన్ వచ్చాడు. నాగ్‌కు ఇది వందో సినిమానే అయితే ప్లానింగ్ అదీ భారీగానే ఉంటుంది. అనౌన్స్‌మెంట్ కూడా ఘనంగానే చేస్తారు. ఈ ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కావచ్చు.