తెలివిగా అడుగులేస్తున్న అనుష్క శెట్టి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత స్వీటీ అనుష్క వరసగా సినిమాలు చేస్తుందని అభిమానులు ఎదురుచూశారు కానీ తను మాత్రం చాలా తెలివిగా ఆచితూచి అడుగులు వేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. విశ్వంభరకు త్రిష కన్నా ముందు ఆ పాత్రను తనకే ఆఫర్ చేశారని గతంలో టాక్ వచ్చింది. అయితే పెద్ద కాన్వాస్ కావడం, మెయిన్ హీరోయిన్ తనే అయినప్పటికీ మరో ముగ్గురు స్క్రీన్ షేర్ చేసుకునే కథ కావడంతో వద్దనుకుంది. స్వంతంగా భావించే యువి క్రియేషన్స్ బ్యానర్, చిరంజీవి సరసన జోడిగా అయినా సరే బాగా అలోచించి సున్నితంగా నో చెప్పేసింది.

దాని స్థానంలో క్రిష్ దర్శకత్వంలో ఘాటికి ఓటేసింది. వేదంలో వేశ్యగా తనలో ఉత్తమ నటిని బయటికి తీసుకొచ్చిన దర్శకుడిగా మరోసారి నమ్మింది. దానికి తగ్గట్టే అమాయకంగా మొదలై గంజాయి వ్యాపారంలో మాఫియా స్థాయికి ఎదిగిన ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. పెర్ఫార్మన్స్ ఇంత స్కోప్ ఉండటమే కాక స్టోరీ మొత్తం తన చుట్టే తిరిగేది కావడంతో ఆలోచించలేదు. ఇంకోవైపు మలయాళం డెబ్యూ కతనర్ లోనూ హారర్ టచ్ ఉన్న ఒక జానపద పాత్రను చేస్తోన్న అనుష్క అక్కడి తెరంగేట్రంలోనూ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టరే దక్కించుకుంది.

ఎవరి సరసన నటిస్తున్నా అనే దానికన్నా ఎంత గుర్తింపు వస్తుందనే దాని మీద అనుష్క ఫోకస్ పెడుతోంది. భాగమతి 2 తీయాలనే ఆలోచన జరిగినా కథా, సరైన దర్శకుడు రెండు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచన మానుకున్నారు. ఘాటి, కథనర్ రెండూ ప్యాన్ ఇండియా సినిమాలే. హిందీతో సహా ప్రధాన భాషల్లో విడుదలకు ప్లాన్ చేయబోతున్నారు. క్రిష్ ఈ ఏడాదిలోనే ఘాటీ రిలీజ్ చేసేలా సెట్ చేస్తున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు బ్యాలన్స్ వైపు దృష్టి పెట్టాలి. కతనర్ మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇవి కాకుండా వేరే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు స్వీటీ.