అనుపమ ముందు నో, తర్వాత ఎస్.. నిజమే

సిద్ధు జొన్నలగడ్డ క్రేజీ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు హీరోయిన్ ఎంపిక వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి ఒక పట్టాన హీరోయిన్ సెట్ కాలేదు. రకరకాల పేర్లను పరిశీలించారు. కొందరికి లుక్ టెస్టులు కూడా చేశారు. కానీ ఎవరూ సెట్ కాక చివరికి అనుపమ పరమేశ్వరన్‌ను కథానాయికగా ఎంచుకుంటే.. ఆమె అర్ధంతరంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ కొన్నాళ్లకు ఆమే ఈ చిత్రంలో నటించింది.

ఈ సినిమాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో అనుపమ తాను ఈ సినిమాలో లిల్లీ పాత్రను తిరస్కరించడం గురించి పరోక్షంగా స్పందించింది. ఇలాంటి పాత్రను వదులుకుంటే తాను స్టుపిడ్ అయ్యేదాన్నని పేర్కొంది.

కాగా ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్ రామ్ కూడా హీరోయిన్ ఎంపిక విషయంలో జరిగిన తతంగం గురించి మ ాట్లాడాడు. అనుపమ పరమేశ్వరన్ ముందు ఈ సినిమాకు ఓకే చెప్పి తర్వాత తప్పుకోవడం.. మళ్లీ సినిమాలో జాయిన్ కావడం నిజమేనని అతను వెల్లడించాడు. ముందు అనుపమనే కాక మడోన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి.. ఇలా రకరకాల పేర్లను పరిశీలించినట్లు.. కొందరికి లుక్ టెస్ట్స్ కూడా చేసినట్లు అతను తెలిపాడు.

ఐతే అనుపమే లిల్లీ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెనే ఫైనల్ చేశామని.. కానీ ఆమె తర్వాత సినిమా నుంచి తప్పుకుని.. మళ్లీ ఈ ప్రాజెక్టులోకి తిరిగొచ్చిందని చెప్పాడు. కథలో బోల్డ్ అంశాలు నచ్చక, ఇంకేవో కారణాలతో అనుపమ తప్పుకున్నట్లు అప్పుడు ప్రచారం జరిగిందని.. కానీ డేట్లు సర్దుబాటు కాకే ముందు సినిమా నుంచి తప్పుకుందని.. తర్వాత సర్దుబాటు చేసుకుని నటించిందని మల్లిక్ తెలిపాడు.