ప్ర‌భాస్ ఇప్పుడేం చేస్తున్నాడు?

ప్ర‌భాస్ ఇప్పుడు కేవ‌లం టాలీవుడ్ స్టార్ కాదు. ఉత్త‌రాది వాళ్లు సౌత్ ఇండియ‌న్ హీరోగా చూసే త‌ర‌హా కూడా కాదు. ట్రూ పాన్ ఇండియా స్టార్ అత‌ను. బాహుబ‌లి అత‌డి ఇమేజ్‌ను అంత‌గా మార్చేసింది. ఈ ఏడాదికి ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘తానాజీ’కి దర్శకత్వం వహించిన ఓం రౌత్.. తనతో సినిమా కోసం బాలీవుడ్ బడా స్టార్లు లైన్లో ఉండగా ఏరి కోరి మన ప్రభాస్‌ను తన తర్వాతి చిత్రానికి కథానాయకుడిగా ఎంచుకున్నాడు.

వీళ్ల కలయికలో రామాయణ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇందులో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే చిత్రీకరణ మొదలుపెట్టడం కోసం జోరుగా ప్రి ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మిగతా నటీనటుల ఎంపిక మీదా దృష్టిసారించాడు ఓం రౌత్.

ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓం రౌత్.. ప్రభాస్‌ను తన సినిమా కోసం ఎలా ప్రిపేర్ చేస్తున్నది వివరించాడు. ప్రస్తుతం ప్రభాస్‌కు లాంగ్వేజ్ ట్రైనింగ్ నడుస్తున్నట్లు అతను వివరించాడు. ‘ఆదిపురుష్’ సినిమాకు హిందీలోనూ ప్రభాసే డబ్బింగ్ చెబుతాడని అతను వెల్లడించాడు. ప్రభాస్‌‌కు హిందీలో మాట్లాడటం ఒక సవాలైతే.. పురాణ గాథకు తగ్గట్లు భాష, డిక్షన్ మీద పట్టు సాధించడం మరో సవాల్. అందుకే ముందు నుంచే లాంగ్వేజ్ ట్రైనింగ్ నడుస్తోంది. దీని తర్వాత ప్రభాస్‌కు ఫిజికల్, క్యారెక్టర్ ట్రైనింగ్ మొదలవుతుందని ఓం రౌత్ తెలిపాడు.

ప్రస్తుతానికి ఫోన్ ద్వారానే కథ, పాత్రల గురించి ప్రభాస్‌తో మాట్లాడుతున్నానని.. లాక్ డౌన్ వల్ల కలిసి చర్చించుకునే అవకాశం లేదని.. పరిస్థితులు చక్కబడ్డాక కలుస్తామని రౌత్ తెలిపాడు. వచ్చే ఏడాది ఆరంభంలో చిత్రీకరణ మొదలు పెట్టి సాధ్యమైనంత వేగంగా సినిమాను పూర్తి చేసి అన్నట్లే 2022లో తమ చిత్రాన్ని విడుదల చేస్తామని అతను వెల్లడించాడు.